Aditya Dhar Success Story: జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు. పూల పాన్పు అసలు కాదు. కష్టాలుంటాయి. కన్నీళ్లు ఉంటాయి. గుండెను ద్రవింపజేసే బాధలు ఉంటాయి. అయినవాళ్లు మోసం చేస్తారు. నమ్మిన వాళ్లు నట్టేట ముంచుతారు. అనుకున్నది జరగకపోగా.. అనుకోనిది జరిగి ఇబ్బంది ఎదురవుతుంది. ఇలా అనేక దుఃఖాలు.. దుర్వార్తలు వెంటాడుతూనే ఉంటాయి. వీటన్నింటినీ దాటుకొని వెళ్తేనే జీవితం.
పై ఉపోద్ఘాతానికి తగ్గట్టుగానే ఉంటుంది బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ జీవితం.. తను ఈ స్థాయికి రాత్రికి రాత్రే రాలేదు. దురంధర్ సినిమా ద్వారా తను ఏకంగా ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీ అయిపోయినప్పటికీ.. ఈ సక్సెస్ అతడికి అంత ఈజీగా రాలేదు. దీని వెనక ఎన్నో కష్టాలు ఉన్నాయి. కన్నీళ్లున్నాయి. బాధలున్నాయి. నిద్ర లేని రాత్రులు కూడా ఉన్నాయి. ఇన్నింటినీ దాటుకొని అతడు ఇక్కడిదాకా వచ్చాడు. హిందీ చిత్ర పరిశ్రమలో ఓవర్గం హవా కొనసాగుతున్న వేళ..అతడు జెండా పాతాడు. చరిత్రలో ఎవరూ సాధించని విజయాన్ని తన పేరు మీద నమోదు చేసుకున్నాడు.
ఆదిత్య స్వస్థలం కాశ్మీర్. కాశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందినవాడు. అక్కడి నుంచి వారి కుటుంబం ఢిల్లీలో స్థిరపడింది. ఆదిత్య తల్లిదండ్రులు ప్రొఫెసర్లు. అతడి సోదరుడు నరేష్ టాపర్. ఆదిత్య మాత్రం dyslexia వ్యాధితో బాధపడేవాడు. అనేక రకాల అవరోధాలు ఎదుర్కొని జగనను ఆకట్టుకునే విధంగా డైలాగ్స్ రాయడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో విజువల్ ఆర్ట్స్ సబ్జెక్టులో డిగ్రీలో చేరాడు. అక్కడ క్రికెట్ విపరీతంగా ఆడేవాడు. అప్ స్పిన్నర్ గా పేరు తెచ్చుకున్నాడు. 2001 భారత అండర్ 19 జట్టులో చోటు తప్పిపోయింది. రాజకీయాల వల్ల అతడు జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. దీంతో కొద్దిరోజులపాటు రంగస్థలం నాటక రంగంలో రచయితగా పనిచేసేవాడు. చివరికి 2006లో ముంబై వచ్చాడు. అక్కడ అనేక కార్యాలయాల చుట్టూ తిరిగాడు. చివరికి హోటల్లో రిసెప్షనిస్ట్ గా పని చేసేవాడు. రేడియోలో జాకీగా కూడా పనిచేసేవాడు. అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత విధు వినోద్ చోప్రా నిర్మాణంలో తీస్తున్న సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కుదిరాడు ఆదిత్య. డబ్బులు సరిపోకపోవడంతో గీత రచయితగా కూడా మారిపోయాడు. చివరికి బూంద్ అనే షార్ట్ ఫిలిం తీశాడు. దానికి అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత మూడు రోజులకు ఒక ప్రొడ్యూసర్ కలిశాడు. ఆదిత్య చెప్పిన కథ నచ్చడంతో ఆ నిర్మాత ఓకే చెప్పాడు. సినిమా పట్టాలు ఎక్కబోతోందనుకుంటుండగా.. ఆ అవకాశం మరో దర్శకుడికి దక్కింది. దీంతో ఆ షాక్ నుంచి కోలుకోవడానికి ఆదిత్య కు చాలా సమయం పట్టింది..
ఈ లోగానే మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ ఆదిత్య కు పరిచయమయ్యాడు. అతడికి అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకున్నాడు. డైలాగ్ రైటర్ గా కూడా అవకాశం ఇచ్చాడు.. ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన అక్రోష్ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో బాలీవుడ్ హీరో అవకాశాలు ఇచ్చారు. సినిమా మరికొద్ది రోజుల్లో పట్టాలు ఎక్క బోతోంది అనుకుంటుండగా.. ఫైనాన్షియర్ కు వ్యాపారంలో నష్టం రావడంతో.. సినిమా తీయడానికి ఆపేశారు. దీంతో ఆదిత్య కు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. ఈలోగా వచ్చిన మరో అవకాశం కూడా దూరమైంది.
అప్పట్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉరి ప్రాంతంలో భారత సైనికుల మీద దాడులు చేశారు.. ఆ కథను సినిమాగా తీయడానికి కరణ్ జోహార్ ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమాలో మరో పాత్రకు ఫవాద్ ఖాన్ ను అనుకున్నారు. అయితే అతడిది పాకిస్తాన్ కావడంతో.. కరణ్ ఆఫీస్ మీద దాడులు జరిగాయి. ఈ క్రమంలోనే భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఉరి ప్రాంతంలో దారుణానికి పాల్పడిన ఉగ్రవాదులను భారత సైన్యం మట్టు పెట్టింది. ఈ ఆపరేషన్ ఆధారంగా ఆదిత్య సినిమా కథ అల్లుకున్నాడు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న వారందరి వివరాలు సేకరించి..ఉరి సినిమా తీశాడు. విక్కీ కౌశల్ హీరోగా రూపొందిన ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. పరిమితమైన బడ్జెట్లో తీసిన ఈ సినిమా.. 300 కోట్లను రాబట్టింది.
ఆ తర్వాత అశ్వద్ధామ అనే సినిమాను తీద్దామని అనుకుంటుండగా.. అనుకోని కారణాలవల్ల అది ఆగిపోయింది. ఈ లోగానే ఆదిత్య దురంధర్ సినిమా స్క్రిప్ట్ రూపొందించాడు.. అది నచ్చి చాలామంది హీరోలు నటించడానికి ముందుకు వచ్చారు. అలా ఆ సినిమా లో రెండు భాగాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఉరి సినిమా చిత్రీకరణలో ఉన్నప్పుడు యామి గౌతమ్ ఆదిత్య కు పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లో 2021 లో యామి గౌతమ్ ఇంటి వద్ద ఆదిత్య వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. ప్రస్తుతం ఈ దంపతులకు వేదవిద్ అనే కుమారుడు ఉన్నాడు.
కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోలేదు. నమ్మిన వాళ్లు మోసం చేసినప్పుడు బాధపడలేదు. జీవితంలో ప్రతి అడుగులో ప్రతిబంధకాలు ఎదురైనప్పుడు వెనకడుగు వేయలేదు. అంతా మనమంచికే అనుకున్నాడు. జరిగింది మొత్తం తనకోసమే భావించాడు. అందుకే ఆదిత్య ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు.