Visakhapatnam Road Construction: రోడ్డు నిర్మాణ పనుల కోసం వేసిన మట్టిలో మృతదేహాలు బయటపడ్డాయి. ఎక్కడి నుంచో మట్టి తెచ్చి రోడ్డు నిర్మాణం కోసం పోయగా.. ఆ మట్టిలో కుళ్లిపోయిన మృతదేహాలు, అస్తిపంజరాలు దర్శనం ఇచ్చాయి. అయితే ఇదేదో మారుమూల ప్రాంతంలో జరిగింది కాదు. విశాఖ నగరంలో చోటు చేసుకుంది ఈ ఘటన. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విశాఖ నుంచి షీలానగర్ మీదుగా సబ్బవరం పోర్టు కనెక్టివిటీ రోడ్డు పనుల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
* విశాఖ నగరంలో ఘటన..
విశాఖలోని షీలా నగర్ జంక్షన్ నుంచి గాజువాక వెళ్లే మార్గంలో పోర్టు కనెక్టివిటీ రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ప్రస్తుతం. ఈ రోడ్డు నిర్మాణ పనుల కోసం లారీల్లో మట్టిని తీసుకొచ్చారు. ఆ మట్టిని రోడ్డు నిర్మాణ ప్రాంతంలో డంప్ చేశారు. అయితే రోడ్డు నిర్మాణం చేపడుతున్న కార్మికులు అక్కడ మట్టి కుప్పం గమనించారు. మట్టి సర్దుతుండగా అందులో ఉన్న మృతదేహాలు కుళ్ళిపోయి కనిపించాయి. దీంతో వారు భయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. తీవ్ర దుర్వాసనతో మృతదేహాలు కనిపించాయి. వాటితో పాటు కొన్ని పుర్రెలు, శరీర భాగాలు కూడా చల్లాచెదురుగా ఆ మట్టిలో పడి ఉన్నాయి. అయితే కార్మికులు తీవ్ర భయాందోళనతో అక్కడి నుంచి పరుగులు తీశారు.
* స్మశాన వాటిక నుంచి మట్టి..
అయితే అదే మట్టిలో మృతదేహాలతో పాటు పాత తలగడలు, బొంతలు, పూలదండలు, దుప్పట్లను కార్మికులు గుర్తించారు. దీంతో ఇది స్మశానవాటికల్లో తవ్విన మట్టిగా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అయితే రోడ్డు కోసం మట్టి తీసుకొచ్చిన ప్రాంతానికి సమీపంలోనే ఓ స్మశాన వాటిక ఉన్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి మట్టిని సేకరించడం వల్లే మృతదేహాలు వెలుగులోకి వచ్చాయని నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. మట్టి తరలించిన డంపర్ లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. రోడ్డు నిర్మాణం కోసం ఏకంగా స్మశాన వాటికను తవ్వడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ మృతదేహాల కలకలం నగరంలో తీవ్ర చర్చకు దారితీసింది.