కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను ఉల్లంఘించిన ఆరోపణలపై ఐదుగురు వైకాపా ఎమ్మెల్యేలకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార పక్షానికి ఇదో ఎదురుదెబ్బగానే చెప్పాలి. టిడిపి, బీజేపీ, సీపీఐ నాయకులు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందడానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులే కారణమంతున్నారు.
పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీలో ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, తాగునీటి పధకాన్ని ప్రారంభించే విషయంలో నగరి ఎమ్మెల్యే రోజా, చిలకలూరిపేట నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎమ్మెల్యే విడుదల రజనీ, ఇతర ఎమ్మెల్యేలు సంజీవయ్య, వెంకటగౌడ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని న్యాయవాది పారా కిశోర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాది ఇంద్రనీల్ బాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు.
అనంతరం ఆరోపణలను ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎమ్మెల్యేలపై తీసుకున్న చర్యలపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ కౌంటర్ ను వారం రోజుల్లో దాఖలు చేయాలని ఆదేశించింది.