సౌదీ అరేబియా, రష్యాల మధ్య చమురు పోరాటం ప్రారంభమై చమురు ధరలు పడిపోవడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆసియాలో అత్యంత ధనవంతుడి హోదాను కోల్పోయారు. గత కొన్ని రోజులుగా వెంటాడుతున్న కరోనా భయానికి రష్యా-సౌదీఅరేబియాల చమురు ప్రతిష్టంభన తోడవడంతో చమురు ధరలు భారీగా పతనమయ్యాయి.
దీంతో చమురు ఆధారిత కంపెనీల షేర్లు అసాధారణ స్థాయిలో పతనమయ్యాయి. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర సోమవారం నాడు భారీగా (12 శాతం) పతనమవడంతో సంస్థ అధినేత ముఖేష్ అంబానీ సంపదలో దాదాపు రూ 42,000 వేల కోట్లు తుడిచి పెట్టుకుపోయాయి. దీంతో.. ఇప్పటివరకూ ఆసియాలో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న ఆయన ఈ స్థానాన్ని అలీబాబా సంస్థ అధినేత జాక్మాకు కోల్పోవాల్సి వచ్చింది.
అలీబాబా సంస్థకు చమురు రంగంతో ప్రత్యక్ష సంబంధం లేకపోవడంతో తాజా తుఫానును జాక్మా కొంత మేర తట్టుకోగలిగారు. అయితే 2021 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్కున్న నికర అప్పులను సున్నాకు చేర్చాలేది అంబానీ లక్ష్యం కూడా ఇప్పుడు ప్రశ్నార్ధకరంగా మారింది.
రిలయన్స్ చమురు సంస్థల్లో కొంత వాటాను సౌదీ అరేబియాకు చెందిన అతిపెద్ద చమురు రంగ సంస్థ ఆరామ్కోకు విక్రయించడంపైనే అంబానీ లక్ష్యం ఆధారపడి ఉంది. కానీ తాజా పరిణామాలతో తన లక్ష్యాన్ని చేరుకోవడంలో అంబానీకి మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.