మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో చర్యల కత్తి బయటకు తీశారు. ‘మా’లో ఇటీవల ఆరోపణలతో నటీనటీలు హోరెత్తించిన సంగతి తెలిసిందే. ‘మా’ అధ్యక్షుడు నరేశ్ , అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ‘హేమ’ లు పరస్పరం ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. అధ్యక్షుడు నరేశ్ పై నటి ‘హేమ’ సంచలన ఆరోపణలు చేసింది. నరేశ్ నిధులు దుర్వినియోగం చేశారంటూ నటి హేమ ఆరోపించడం కలకలం రేపింది. దీనిపై స్పందించిన నరేశ్.. ‘హేమ’వ్యాఖ్యలను ఖండించారు. హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హేమ సరిగ్గా స్పందించకుంటే అసోసియేషన్ నుంచి వెలివేసేందుకు కూడా కార్యవర్గం రెడీ అయినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే ‘మా’ రచ్చ మాటల మంటలపై మెగా స్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. ఇండస్ట్రీ పెద్దగా ఈ లొల్లిని అరికట్టేందుకు సిద్ధమయ్యారు. ‘మా’ ఎన్నికల వేళ ఇలా ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో వెంటనే ఎన్నికలు జరపాలని ‘మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖ రాశారు. ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని.. అలాంటి బహిరంగ ప్రకటనలతో ‘మా’ ప్రతిష్ట మసకబారుతుందని చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక ప్రత్యేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వారికి కూడా చిరంజీవి ఫోన్ చేసి మరీ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఎవరూ బజారునపడి వ్యాఖ్యలు చేయవద్దని.. ఎన్నికలు జరిగేంత వరకూ సైలెంట్ గా ఉండాలని కోరినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే క్రమశిక్షణ సంఘం కూడా తాజాగా రంగంలోకి దిగింది. ఆరోపించిన నటి ‘హేమ’కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికలు మున్ముందు మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.