జగన్ బెయిల్ రద్దు చేయించేదాకా నిద్రపోయేది లేదని భీష్మించిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. విజయసాయి రెడ్డి బెయిల్ సైతం రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అధికారాన్ని ఉపయోగించి ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బెయిల్ రద్దు పిటిషన్లో రఘురామ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు ఆసక్తికర చర్చకు దారితీసింది.
జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ చాలా కాలం క్రితమే హైదరాబాద్ సీబీఐ కోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసులో విచారణ పూర్తిచేసిన కోర్టు.. ఈ నెల 25వ తేదీ వరకు తీర్పును రిజర్వు చేసింది. కాగా.. ఈ నెల 7వ తేదీన ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని పిటిషన్ వేశారు. జగన్ బెయిల్ రద్దు కేసు నేపథ్యంలో ఏ2గా ఉన్న విజయసాయి విదేశాలకు పారిపోకుండా ఆయన బెయిల్ రద్దు చేయాలని పిటిషన్లో కోరారు రఘురామ.
ఆ రోజే విచారణకు స్వీకరించిన సీబీఐ న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలని విజయసాయిని, సీబీఐని ఆదేశించింది. ఇందుకోసం మూడు రోజుల గడువు విధించి, ఈ నెల 10కి కేసు విచారణ వాయిదావేసింది. దీంతో.. మళ్లీ ఇవాళ విచారణ చేపట్టింది. అయితే.. కౌంటర్ దాఖలుకు మరికొంత సమయం కావాలని సీబీఐ కోరింది. దీంతో.. మరో మూడు రోజుల గడువు ఇస్తూ.. కేసును ఈ నెల 13వ తేదీకి విచారణ వాయిదా వేసింది కోర్టు.
అయితే.. విజయసాయి తరపు న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారా లేదా? అనే విషయమై స్పష్టత లేదు. దీనిపై మీడియాలో పలు కథనాలు వచ్చాయి. విజయసాయి లాయర్లు కోర్టుకు రానందున.. న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసిందని వార్తలు వచ్చాయి. తాము జారీచేసిన నోటీసులకు విజయసాయి నుంచి స్పందన లేకపోవడం పట్ల ఆగ్రహించిందని ఆ వార్తల సారాంశం. అంతేకాకుండా.. 13వ తేదీన సీబీఐతోపాటు విజయసాయి కూడా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించిందని మీడియాలో వార్తలు వచ్చాయి.
దీంతో.. విజయసాయి విషయంలో జరుగుతున్న ప్రచారం నిజమేనా? అనే చర్చ మొదలైంది. ఒకవేళ నిజంగానే కోర్టుకు సమాధానం ఇవ్వకపోతే.. 13వ తేదీన కూడా ఎలాంటి సమాధానం ఇస్తారు? అనే చర్చ సాగుతోంది. బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదో సరైన కారణం చూపించకపోతే.. రఘురామ రాజు కోరిక నెరవేరుతుందా? అనే చర్చ కూడా సాగుతోంది. వీటన్నింటిపై స్పష్టత రావాలంటే.. 13వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే.