ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఇకపై అన్ని రీచ్ ల్లోనూ ఒకే ధర ఉండనుండగా ఇసుక నాణ్యతను బట్టి ఎక్కడైనా ఇసుకను కొనుగోలు చేసే అవకాశాన్ని జగన్ సర్కార్ కల్పిస్తోంది. ఏపీ పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. ఇసుక టెండర్లకు సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ప్రజల ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఇసుక పాలసీలో మార్పులు చేసి కొత్త ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒక ఇసుక రీచ్ ను ఏర్పాటు చేస్తున్నామని.. నిర్ణయించిన ధర ప్రకారం రాష్ట్రంలో ఇసుక అమ్మకాలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. ఇసుక వినియోగదారులు సొంత వాహనాలలో కూడా ఇసుకను తీసుకెళ్లవచ్చని.. నాణ్యతను పరిశీలించి ఇసుక ఎక్కడ నాణ్యంగా ఉంటే అక్కడే ఇసుకను తీసుకెళ్లవచ్చని ద్వివేది తెలిపారు. ప్రైవేట్ సంస్థకు ఇసుక అమ్మకాలు, తవ్వకాలను అప్పగించడంపై కూడా ఆయన స్పందించారు.
ఇసుక తవ్వకాలు, రీచ్ ల నిర్వహణకు సంబంధించి రీచ్ లను ఆహ్వానించామని.. టెండర్ల నిర్వహణ పూర్తి పారదర్శకంగా జరిగిందని ఆయన అన్నారు. టెండర్ల ఆధారంగానే ఎంఎస్టీసీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ద్వివేది తెలిపారు. ఈ ఏజెన్సీ ఎంతో అనుభవం ఉన్న ఏజెన్సీ కావడంతో ఏజెన్సీ, ప్యాకేజీలకు కచ్చితమైన నిబంధనలను పెట్టామని ఆయన అన్నారు.
కంపెనీకి సంబంధించిన సాంకేతిక, ఆర్థిక అర్హతలను ముందుగానే పరిశీలించామని.. టెండర్ సంస్థ ప్రతి 15 రోజులకు ఒకసారి డబ్బులను చెల్లించాల్సి ఉంటుందని ద్వివేది తెలిపారు. టన్ను ఇసుక ధర 475 రూపాయలుగా నిర్ణయించామని.. రవాణా ఛార్జీలు అదనంగా ఉంటాయని ద్వివేది పేర్కొన్నారు.