Homeఅత్యంత ప్రజాదరణభారతీయుల అమెరికా వ్యామోహం తీరిపోయిందా?

భారతీయుల అమెరికా వ్యామోహం తీరిపోయిందా?

Indians USA

దూరపు కొండలు నునుపు అన్నట్టు అగ్రరాజ్యం అమెరికా అంటే ఇన్నాళ్లు ఒక పిచ్చి.. ఆ యావలో పడి మనోళ్లు కలలుగన్నారు. అమెరికాలో చదువు, ఉద్యోగం అంటే పడిచచ్చారు. ముఖ్యంగా ఈ యావ తెలుగోళ్లకు మరీ ఎక్కువ. అందుకే ఆస్తులమ్మి, అప్పులు చేసి, బ్యాంకుల్లో రుణాలు తీసుకొని మరీ అమెరికా వెళ్లారు.. ఇన్నాళ్లు హనీమూన్ బాగా గడిచింది. మనోళ్లు బాగా సంపాదించారు. నాలుగు రాళ్లు వెనకేసుకున్నారు. కానీ గత ట్రంప్ ప్రభుత్వం వచ్చాక అక్కడ విదేశీయులకు టైట్ చేసింది. అక్కడికి వెళ్లిన పరిస్థితులు తలకిందలై ఉద్యోగ, ఉపాధి కానకష్టమైంది. హెచ్1బీ వీసాలు, వలసల నిషేధంతో మనవాళ్ల అమెరికా కలలు కల్లలయ్యాయి. అప్పట్లో ఏదో తెలియని యూనివర్సిటీల్లో విచారించకుండా చేరుతున్న చేరిన భారతీయ విద్యార్థులు కొందరు జైలుపాలయ్యారు. కొందరు భారత్ కు తిరిగివచ్చారు. అమెరికాలో వలసదారులను దేశం విడిచి వెళ్లిపోవాలని గత ట్రంప్ నేతృత్వంలో అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అక్రమంగా ఉంటున్న విద్యార్థులు, నిరుద్యోగులు పొట్టచేతపట్టుకొని భారత్ కు తిరిగి వచ్చారు.

Also Read: గ్రేటర్‌‌ హైదరాబాద్‌.. గ్రేట్‌ హిస్టరీ..

అమెరికా స్వప్నం ట్రంప్ హయాంలో చెదిరింది. వాస్తవాన్ని కళ్లకు గట్టింది. ఫార్మింగ్టన్ యూనివర్సిటీ పేరుతో వందలాది మంది భారతీయ విద్యార్థులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన అమెరికా సర్కారు.. వివిధ రాష్ట్రాల్లో ఉన్న మరో ఐదు ప్రైవేటు వర్సిటీల్లో చోటు చేసుకున్న అక్రమ వ్యవహారాలతో వాటిని మూసివేయించింది. అమెరికాలోని తెలుగు సంఘాలు, ప్రవాసులు తీవ్ర ఆందోళన చెందారు.

అయితే ట్రంప్ దిగిపోయాడు. ప్రజలు సాగనంపారు. జోబైడెన్ గెలిచాడు. ప్రవాసులు, విదేశీయులకు ఊరటనిచ్చాడు. ట్రంప్ మిగిల్చిన చేదు నిజాలు, వాస్తవాలు మాత్రం ఇప్పటికీ భారతీయులను వెంటాడుతున్నాయి. బతికుంటే బలిసాకు తినొచ్చని కేసీఆర్  ఊరికే అనలేదు. ఇప్పుడు భారతీయుల ఆలోచనధోరణి పూర్తిగా మారింది. కరోనా దెబ్బకు అందరికీ పైసల కంటే ప్రాణం ముఖ్యమని తెలిసొచ్చింది. కోట్లు సంపాదించిన వారిని కూడా కరోనా ధాటికి కాపాడుకోలేకపోయారు. ప్రాణాలు విడిచారు. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం బెటర్ అన్న ధోరణి భారతీయుల్లో ఎక్కువైంది.

ఇప్పటికే అమెరికాలో సెటిలైన వారికి తప్పదు కాబట్టి అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు భారత్ నుంచి అమెరికా వెళ్లాలనుకునే వారు మాత్రం అమెరికా ఆశలను వదలుకుంటున్నారు. ఇక్కడే ఏదో ఒకటి చేసుకోవాలని యోచిస్తున్నారు. ఇప్పుడు భారతీయుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందంటున్నారు.

అమెరికాలో చదివించడం అనేది ఇన్నాళ్లు ఒక స్టేటస్‌గా మారిపోయింది. ఇంజనీరింగ్‌ లేదా మెడిసిన్‌ పట్టా అందుకోగానే, చాలామంది విదేశాలకు పయనమవుతున్నారు. ప్రధానంగా అమెరికాపై మనోళ్ళకి ఉన్న మోజు అంతా ఇంతా కాదు. 2019-20లో అమెరికాలో ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు ఏకంగా 7.60 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారట. ఆ దేశంలో అత్యధికంగా చదువుతున్న విదేశీయుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారట. వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో గత ఐదేళ్లతో పోలిస్తే 2019-20లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులు 4.40 శాతం తగ్గారు.

Also Read: ట్రంప్‌ మరో భారీ కుట్ర

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రభావంతో 2020-21కి ముందస్తు దరఖాస్తులు దాదాపు 40 శాతం తగ్గిపోయాయి. అమెరికా స్టేట్‌ బ్యూరో ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ తాజాగా విడుదల చేసిన నివేదిక అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించింది.

భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, మెడిసిన్‌, మ్యాథ్స్‌ కోర్సుల్లో ఎంఎస్‌, పీహెచ్‌డీ చేస్తున్నారు. అమెరికాలో మొత్తం 74 యూనివర్సిటీల్లో భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరిలో 50 శాతం మంది 27 టాప్‌ యూనివర్సిటీల్లోనే చేరుతున్నారట. కాలిఫోర్నియా, న్యూయార్క్‌, టెక్సాస్‌, మసాచుసెట్స్‌, ఇల్లినాయిస్‌, పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, ఓహియో, మిచిగాన్‌, ఇండియానా రాష్ట్రాల్లో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఉన్నారట.

మన విద్యార్థులు ఎక్కువగా న్యూయార్క్‌ యూనివర్సిటీ, నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్సిటీ (బోస్టన్‌), యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా, కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌, అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా (లాస్‌ఏంజెల్స్‌), యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా (శాండియాగో), పర్డ్యూ యూనివర్సిటీ, బోస్టన్‌లో ఎక్కువగా ఉన్నరని తెలుస్తోంది.

కరోనా మహమ్మారి, ట్రంప్ దెబ్బకు భారతీయులు ఇప్పుడు అమెరికా చదువులు, ఉద్యోగాలకు వెనుకంజ వేస్తున్నట్టు గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఎక్కడో అమెరికాలో వలసదారుల పాలనలో బతికేకంటే.. ఇక్కడే ఎంతో కొంత సేఫ్ గా బతకడం బెటర్ అన్న ఆలోచనలో భారతీయులు ఉన్నారు. అందుకే ఇప్పుడు అమెరికా వీసాల కంటే.. భారతీయతే బెటర్ అన్న ఆలోచనకు వచ్చారట.. మార్పు, మరక మంచిదే.. కరోనా మార్చిన కథ ఇదీ.. దేనికైనా ఓ అంతం ఉంటుందంటే ఇదేనేమో కదా..

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

-నరేశ్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

2 COMMENTS

Comments are closed.

RELATED ARTICLES

Most Popular