Indian farmer holding crop plant in his Wheat field
కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల భారీగా నష్టపోయిన వాళ్లలో రైతులు కూడా ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలు పథకాల అమలు ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుస్తుండగా తాజాగా రైతులకు ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో) మరో శుభవార్త చెప్పింది. పండగ సమయంలో రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఇఫ్కో ఎరువుల ధరలను భారీగా తగ్గించింది.
20 : 20 : 0 : 13 ఎన్పీ ధరను ఏకంగా 50 రూపాయలు తగ్గించింది. ఇఫ్కో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రైతులపై భారం తగ్గనుంది. నిన్నటివరకు ఈ ఎరువు ధర 975 రూపాయలు ఉండగా ఇఫ్కో తీసుకున్న నిర్ణయం వల్ల 925 రూపాయలకు తగ్గనుంది. రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తగ్గింపు ధర తక్షణమే అమలులోకి వస్తుందని ఇఫ్కో చెబుతోంది. పురుగుమందుల, ఎరువుల ధరలను పెంచబోమని ఇఫ్కో కీలక ప్రకటన చేసింది.
ఇఫ్కో సల్ఫర్ ధరను టన్నుకు 1000 రూపాయల మేర తగ్గించగా ఎన్పీకే, డీఏపీ ధరలు కూడా తగ్గిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్రం రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పంట కొనుగోలులో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే రైతుల నుంచి పంట కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడుతోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లాంటి పథకాల ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది.
మారుతున్న కాలానికి తగ్గట్టుగానే వ్యవసాయం ఖర్చులు భారీగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రైతులకు కొంతమేర ఖర్చులను తగ్గిస్తూ లాభం చేకూరుస్తూ ఉండటం గమనార్హం.