దేశంలో లాక్ డౌన్3.0 మరో ఆరు రోజుల్లో (మే 17) ముగియనున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం ప్రధాని మోడి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ముఖ్యమంత్రులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా మోడీ వలస కూలీల గూర్చి మాట్లాడటం గమనార్హం. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎక్కడివారు అక్కడే ఉండాలని మనం పదే పదే అప్రమత్తం చేస్తూ వచ్చాం. అయితే ఇంటికి వెళ్లాలని కోరుకుకోవడం మానవుని సహజ లక్షణం. అందుకే మన నిర్ణయాలను కొంతమేర మార్చుకున్నాం. ఇక ప్రస్తుతం గ్రామాలకు వైరస్ సోకకుండా చూసుకోవడమే మన ముందు ఉన్న అతిపెద్ద సవాలు’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వలస కార్మికుల గురించి ఆయన మాట్లాడుతూ.. ఇంటికి వెళ్లాలనుకోవడం మానవుడి సహజ లక్షణం అని పేర్కొన్నారు. వలస కార్మికుల తరలింపు ప్రక్రియలో రాష్ట్రాలు సమన్వయం చేసుకుంటూ సహకరించుకోవాలని కోరారు. అదే సమయంలో కరోనా వైరస్ గ్రామాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు. ఏ ప్రాంతంలోనైనా భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.
‘‘కరోనాపై యుద్ధంలో రాష్ట్రాలదే కీలక పాత్ర అని మోడీ అన్నారు. బాధ్యతనెరిగి.. కరోనాను ధీటుగా ఎదుర్కొన్నాయి. ఆరోగ్య సేతు యాప్ ఆవశ్యకతను వివరిస్తూ.. ఆ యాప్ ను డౌన్ లోడ్ చేసుకునేలా ప్రజలను కార్యోన్ముఖుల్ని చేయాలని ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు.
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 24 అర్ధరాత్రి నుంచి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైరస్ తీవ్రత దృష్ట్యా ఏప్రిల్ 13, మే 3 వరకు మరో రెండు దఫాలు లాక్ డౌన్ పొడిగిచింన మోదీ సర్కారు.. మూడోసారి మే 17వ తేదీ వరకు ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో ప్రజల రాకపోకలు, ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి పలు సడలింపులు ఇచ్చింది.