Red Kumkum : భారతీయ సంస్కృతి ప్రకారం దేహాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా భావిస్తారు. మన శరీరంలోని ప్రతి అవయవానికి ప్రతీకాత్మక అర్థాలను కొందరు ఆధ్యాత్మికవాదులు వివరించారు. ఇందులో పాపిట, నుదురు, కంఠం, వక్షస్థలం, నాభి వంటి ప్రాంతాలకు భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. వీటిలో నుదుటి మధ్యభాగానికి మరింత ప్రత్యేకత ఉంది. దీనిని అజ్ఞా చక్రం అని అంటారు. ఏకాగ్రత, జ్ఞానానికి ప్రతీకగా దీనిని భావిస్తారు. ఇక్కడ కుంకుమ ధరించడం వల్ల భగవంతుడిని దర్శించవచ్చని హిందువుల విశ్వాసం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
రెండు కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశాన్ని అజ్ఞా చక్రం అని అంటారు. దీనినే మూడో నేత్రం అని కూడా పిలుస్తారు. ఈ నేత్రం ద్వారా భగవంతుడిని దర్శించుకోవచ్చు అని ఆధ్యాత్మిక వాదులు తెలుపుతారు. అందుకు ప్రతీకగా ఇక్కడ కుంకుమను ధరిస్తారని చెబుతారు. అంతేకాకుండా శరీరంలోని అన్ని నాడులకు ఇక్కడే కేంద్రం ఉంటుందని గురువుల విశ్వాసం. నుదుటిపై కుంకుమను ధరించేటప్పుడు వేలితో ఈ ప్రదేశాన్ని వత్తి పట్టడం వల్ల శరీరంలోని అన్ని నాడలు చైతన్యం అవుతావని నమ్మకం.
అయితే హిందూ సాంప్రదాయంలో పెళ్లయిన మహిళలు పాపిట్లో సింధూరం ధరిస్తూ ఉంటారు. ఇలా ధరించడం వల్ల తమ భర్తకు మంచి ఆయుష్షు, కుటుంబ సంతోషాలు ఉంటాయని నమ్మకం. అయితే ఎరుపు రంగు కుంకుమనే ఎందుకు ధరించాలి అన్న సందేహం చాలామందికి వస్తుంది. భారతీయ సంస్కృతిలో ఎరుపు రంగు ప్రత్యేకమైన ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. దీనిని నుదుటిపై ధరించడం వల్ల నిర్దిష్ట వైద్య ప్రయోజనం కలుగుతుందని అంటుంటారు.
కుంకుమను కేవలం మహిళలు మాత్రమే కాకుండా క్షత్రియ వంశానికి చెందిన రాజులు కూడా వీరత్వానికి చిహ్నంగా ధరించేవారు. వర్తక, వాణిజ్యాల ద్వారా సంపాదన పెంపొందించడానికి వ్యాపారులు కుంకుమను ధరించే వారిని చరిత్ర తెలుపుతుంది. అయితే కొందరు ఎరుపు రంగు కుంకుమను ధరిస్తుండగా.. మరికొందరు చందనం, విభూది వంటివి భరిస్తూ వస్తున్నారు. ఏదైనా కనుబొమ్మల మధ్యలో ధరించడం వల్ల విద్యుత్ అయస్కాంత శక్తి వెలువడుతోంది.
అయితే ప్రస్తుత కాలంలో చాలామంది ప్లాస్టిక్ తో తయారైన వాటిని ధరిస్తున్నారు. వీటికి బదులు స్వచ్ఛమైన ఎర్రటి సింధూరం ధరించడం వల్లే ఆయురారోగ్యాలు ఉంటాయని కొందరు ఆధ్యాత్మిక వాదులు చెబుతున్నారు.