Telangana land issues : తెలంగాణలో భూముల దందా… సారీ, భూముల వ్యవహారం అద్భుతం! ప్రభుత్వం మారినా పోర్టల్ పేరు మారినా రైతుల కష్టాలు మాత్రం ‘ఎటర్నల్’ అన్నట్టు సాగుతున్నాయి. ధరణి పోయి భూ భారతి వచ్చింది. కానీ పాత సమస్యలే కొత్త వేషంలో మళ్ళీ దర్శనమిస్తున్నాయి. పేరు మారిస్తే జాతకం మారుతుందని నమ్మే మన పాలకులకు.. సాఫ్ట్వేర్ కూడా అంతే అనిపిస్తుందేమో!
పాత డొల్ల.. కొత్త నొల్ల!
‘ధరణి’లో వంద రకాల సమస్యలు ఉంటే, వాటిని పరిష్కరిస్తామని వచ్చిన ‘భూ భారతి’లో కొత్తగా లొసుగులు బయటపడుతున్నాయి. అంటే పాత సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్తవి బోనస్గా వస్తున్నాయన్నమాట. ఇదో రకమైన ‘డబుల్ బొనాంజా’ రైతులకు!
‘ఫీజు’ వసూలు.. ‘తిరిగి ఇవ్వడం’ జాప్యం!
ధరణి ఉన్నప్పుడు స్లాట్ రద్దు చేసుకుంటే కట్టిన డబ్బులు తిరిగి రావడానికి అంతులేని జాప్యం జరిగేది. ఇప్పుడు భూ భారతి వచ్చాక కూడా అదే పరిస్థితి. ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకోవడం తెలుసు.. కానీ తిరిగి ఇవ్వడం కొంచెం ‘కష్టం’ కదా మరి!
ఏజెంట్ల రాజ్యం.. సర్కార్కు ‘కన్నం’!
ఇక అతిపెద్ద కామెడీ ఏంటంటే… మీ సేవ ఏజెంట్లు రిజిస్ట్రేషన్ ఛార్జీలను జేబులో వేసుకుంటుంటే సర్కార్ దాన్ని అడ్డుకోలేకపోతోంది. తహశీల్దార్లకు ఆ ఛార్జీలను చూసే అవకాశం లేకపోవడంతో ఏజెంట్లు కోట్లు వెనకేసుకుంటున్నారు. ప్రభుత్వానికి మాత్రం చుక్కెదురు. వరంగల్ పోలీసులే రంగంలోకి దిగి అరెస్టులు చేసే వరకు ఈ వ్యవహారం సర్కారుకు తెలియకపోవడం, వారి ‘పనితీరుకు’ అద్దం పడుతోంది.
ఆరు నెలలు.. ఆశల ‘సమాధి’!
ఈ సమస్యలన్నీ పరిష్కారం కావడానికి, భూ భారతి పోర్టల్ పక్కాగా మారడానికి మరో ఆరు నెలలు పడుతుందని అధికార వర్గాలే చెబుతున్నాయి. అంటే అప్పటివరకు రైతుల తిప్పలు యథాతథమే! పేరు మార్చి ప్రజలను బురిడీ కొట్టించడం కాకుండా సమస్యల మూలాలను పట్టుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ధరణిలో సమస్యలు ఉంటే భూ భారతి తెచ్చారు, మరి భూ భారతిలో సమస్యలు ఉంటే ఏం తెస్తారు? ‘భూ నరకం’? ఏది ఏమైనా తెలంగాణలో భూమి కొన్నా, అమ్మినా.. అది ఒక పెద్ద ‘సాహస యాత్రే’!