
యడియూరప్ప రాజీనామాతో కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కొత్త సీఎంగా బసవరాజు బొమ్మై పేరును ఖరారు చేశారు. ఆయన పేరును బీజేపీ కోర్ కమిటీ ఖరారు చేసింది. తమ నిర్ణయాన్ని పార్టీ అధిష్టానికి పంపింది. యడియూరప్ప వారసుడిని ఎన్నుకొనేందుకు భాజపా శాసనసభాపక్షం సమావేశం బెంగళూరులో జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలంతా బసవరాజు బొమ్మై ను నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు కేంద్ర పరిశీలకులుగా మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జీ కిషన్ రెడ్డి హాజరయ్యారు. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బసవరాజు బొమ్మై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడు. 1998 లో జనతాదల్ పార్టీలో చేరడంతో బసవరాజు బొమ్మై రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆయన 1998, 2004 లో జనతాదల్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆ తర్వాత 2008లో బీజేపీలో చేరారు. ఇప్పటి వరకు ఆయన యెడియూరప్ప మంత్రి వర్గంలో హోంశాఖ మంత్రిగా ఉన్నారు.