Lok Sabha approves Amaravati Bill : అమరావతి: కాలం కలిసొస్తే కథ మారుతుందంటారు.. కానీ సంకల్పం బలంగా ఉంటే చరిత్రే మారుతుందని అమరావతి నిరూపించింది. గత ఐదేళ్లుగా అణచివేతను, అవమానాలను, అగౌరవాన్ని భరించిన ఆ గడ్డకు నేడు దేశ అత్యున్నత చట్టసభ లోక్సభ సాక్షిగా సముచిత గౌరవం దక్కింది. ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదముద్ర వేయడంతో, అమరావతి ప్రస్థానంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.
కన్నీటి వెనుక కంచుకోట..
ఇది కేవలం ఒక బిల్లుకు ఆమోదం కాదు.. వేలమంది రైతుల త్యాగాలకు, వేలాది రోజుల పోరాటానికి దక్కిన గుర్తింపు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు రోడ్లపైకి వచ్చి, ఎండనక వాననక చేసిన ఉద్యమం వృథా పోలేదని నేడు నిరూపితమైంది. “అమరావతి ఇక అజేయం.. అజరామరం” అనే నినాదం నేడు పార్లమెంటు గోడల మధ్య ప్రతిధ్వనించింది.
లోక్సభలో అపూర్వ మద్దతు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై సుమారు రెండు గంటల పాటు అర్థవంతమైన చర్చ జరిగింది. పక్షం, విపక్షం అనే తేడా లేకుండా దాదాపు అన్ని పార్టీల ఎంపీలు అమరావతి ఆవశ్యకతను నొక్కి చెప్పారు. చివరకు స్పీకర్ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించగానే, ఏపీ ప్రజల గుండెల్లో ఒక రకమైన భావోద్వేగ ప్రకంపన మొదలైంది.
రేపే అసలైన క్లైమాక్స్.. రాజ్యసభలో పోరు!
లోక్సభ దాటిన ఈ చారిత్రక బిల్లు ఇప్పుడు పెద్దల సభ రాజ్యసభ ముందు నిలిచింది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చ జరగనుంది. ఇప్పటికే సెక్రటరీ జనరల్ బిల్లు అందినట్లు ప్రకటించడంతో, యావత్ ఆంధ్రప్రదేశ్ ఉత్కంఠగా రాజ్యసభ వైపు చూస్తోంది.
అమరావతి అంటే కేవలం ఒక ప్రాంతం కాదు.. అది ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం. ఈ చట్టబద్ధతతో ఇకపై ఏ శక్తీ అమరావతిని కదిలించలేదు, మార్చలేదు. రేపు రాజ్యసభలో కూడా ఆమోదం లభిస్తే, అమరావతి ప్రయాణం అప్రతిహతంగా ముందుకు సాగుతుంది. జై అమరావతి!
