ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ఏపీ ప్రభుత్వానికి టీటీడీ అండగా నిలిచేందుకు సిద్ధమైనట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.. శ్రీవారి సొమ్మును బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయకుండా ప్రభుత్వానికే వడ్డీకి ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రచారం సాగుతోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం కలకలం రేపుతోంది. ఉద్దేశపూర్వకంగానే శ్రీవారి నిధులను మళ్లించేందుకు ఈ ప్లాన్ చేస్తున్నారనే ఆరోపణలు టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్నాయి.
Also Read: విజయవాడ కనకదుర్గను దర్శించుకోండిలా.. ఏర్పాట్లు ఇవీ!
శ్రీవారికి రోజువారీగా కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంటుంది. ఆ ఆదాయాన్ని బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తుంటారు. శ్రీవారి ఫిక్స్డ్ డిపాజిట్లను బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసి మరీ ప్రభుత్వ బాండ్లను కొనే అవకాశం ఉంది. బ్యాంకుల ద్వారా ప్రస్తుతం 3 నుంచి 4 శాతం మాత్రమే వడ్డీ లభిస్తోందని.. అదే బాండ్ల ద్వారా 7 శాతం లభించే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాండ్లని చెబుతున్నా.. టీటీడీ అసలు ఉద్దేశం ఏపీ సర్కార్కు శ్రీవారి నిధులు మళ్లించడమేననేది తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ సర్కార్కు ఎక్కడా అప్పు పుట్టడం లేదు. ఆర్బీఐలో తీసుకోవాల్సిన రుణం పరిధి దాటిపోయింది.
అటు అప్పు పుట్టక.. ఇటు ఆదాయం లేక ప్రభుత్వం శ్రీవారి నిధులపై కన్నేసినట్లుగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నిర్ణయం మరోసారి టీటీడీపై తీవ్రమైన వివాదం రేపడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే శ్రీవారి భూముల అమ్మకంపై రేగిన వివాదంతో.. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
Also Read: వరద బాధితులకు జగన్ సర్కార్ సాయం.. ఉత్తర్వులు విడుదల..?
హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్న సమయంలో.. ఇలాంటి తీవ్రమైన నిర్ణయాన్ని టీటీడీ లేదా.. ప్రభుత్వం తీసుకుంటుందా.. అన్న చర్చ కూడా జరుగుతోంది. టీటీడీ ఇలాంటి నిర్ణయం తీసుకోబోతోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.. ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ సర్కార్.. ఈ తాజా నిర్ణయంతో మరింత దుమారం చెలరేగేలా ఉంది. అయితే ఇది అమలవుతుందా? లేదా వట్టి పుకార్లా అన్నది తెలియాల్సి ఉంది.