తెలంగాణలో మరో పార్టీ పురుడు పోసుకుంటోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ గురువారం ప్రారంభించనున్నారు. వైఎస్ జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపుల పాయలో తండ్రి జయంతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుని పార్టీ ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించుకున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామని పార్టీకి వైఎస్సార్ టీపీ అని నామకరణం చేయనున్నారు. దీంతో ప్రస్తుతం రాజకీయ సమీకరణలు మారే సూచనలు కనిపిస్తున్నాయి.
పార్టీ జెండా, ఎజెండా కూర్పు ఇదివరకే చేశారు. ప్రజాసమస్యల పరిష్కారంలో ఎక్కడా తగ్గేది లేదని చెబుతున్నారు. ఇప్పటికే నిరుద్యోగుల బాధలు గుర్తించి వారి కుటుంబాలను పరామర్శించి వారిలో ఆత్మస్థైర్యం నింపే పనిలో భాగంగా తెలంగాణలో పర్యటించిన షర్మిల వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెబుతున్నారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి సాయంత్రం రాయదుర్గంలోని జెఆర్సీ కన్వెన్షన్ కేంద్రానికి చేరుకుంటారు. 5 గంటలకు వేదికపై అమరవీరుల స్తూపానికి, వైఎస్ విగ్రహానికి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పార్టీ స్థాపన, లక్ష్యాలు, ఎజెండాపై ప్రకటన చేయనున్నారు. ఇప్పటి వరకు కోర్ టీంగా నిలిచిన కొండా రాఘవరెడ్డి, పిట్ట రాంరెడ్డి, తూడి దేవేందర్ రెడ్డి తదితరులు హాజరవుతారు.
ఇప్పటికే ఫిబ్రవరి 9న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో భారీ బహిరంగ నిర్వహించారు నిరుద్యోగుల కోసం దీక్ష చేపట్టారు. అధికార పార్టీ టీఆర్ఎస్ , కాంగ్రెస్, బీజేపీలపైనా విమర్శలు చేశారు. ఈ మేరకు షర్మిల తెలంగాణల పార్టీ పెడితే పరిస్థితులు ఎలా ఉంటాయోననే అంచనాల్లో ఇతర పార్టీలు మునిగిపోయాయి.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read More