Homeజాతీయ వార్తలుABN RK Sharmila: జగన్ శత్రువుతో వైఎస్ షర్మిల ఇంటర్వ్యూ.. ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

ABN RK Sharmila: జగన్ శత్రువుతో వైఎస్ షర్మిల ఇంటర్వ్యూ.. ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

ABN RK Sharmila: ‘శత్రువుకు శత్రువు’ మిత్రుడు అన్నది నానుడి. ఇప్పుడు తన తోడబుట్టిన వాడే కాలదన్నిన వేళ ఇక వేరే దారిలేక తన శత్రువు పంచనే చేరింది ఓ ఆడకూతురు. తనకు అలివి కాని పక్కరాష్ట్రంలో రాజకీయం మొదలుపెట్టింది మరీ. నిజానికి ఆమె ఈ రాజకీయం చేస్తుందని ఆ మీడియా మేధావికి ముందే తెలుసు.. అతడే బ్రేక్ చేశాడు కూడా.. కానీ ముందు ‘తూచ్’ నే రావట్లేదు అంది.. ఆ తర్వాత మాట సవరించి రాజకీయాల్లోకి వచ్చేసింది ఆ ఆంధ్రా ఆడకూతురు వైఎస్ షర్మిల.. కట్ చేస్తే ఇప్పుడు జగన్(YS JAGAN) కు పగవాడు, శత్రువుగా భావించే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతోనే ఇంటర్వ్యూ కు రెడీ అయిపోయింది. ఈ పరిణామం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

-పగవాడితో ఇంటర్వ్యూనా?
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ(ABN Radha krishna) తోపాటు మరో మీడియా సంస్థ అధినేత ఇద్దరూ కూడా టీడీపీ అధినేత చంద్రబాబుకు గట్టి మద్దతుదారులు అని తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా చెబుతారు. వారి పత్రికల్లో చానెల్స్ లో టీడీపీకి వ్యతిరేకంగా వచ్చింది లేదు. అదే సమయంలో ప్రత్యర్థులను నీరుగార్చేలా కథనాలు బోలెడు వచ్చాయి. అస్సులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నా.. జగన్ అన్నా ఈ మీడియా దుమ్మెత్తి పోస్తుంటుంది. స్వయంగా వైఎస్ఆర్ సైతం నాడు సీఎంగా ఉన్న రోజుల్లో ‘ఆ రెండు పత్రికలు’ వీటిపై ప్రతీకారంతో రగిలిపోయారు. అలాంటి మీడియా అధిపతితో ఇప్పుడు తెలంగాణలో ‘వైఎస్ఆర్ టీపీ’ అనే పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల భేటి కావడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న ప్రశ్న..

-ప్రత్యర్థులకు షర్మిల బలాన్ని ఇస్తున్నారా?
ఎంతైనా జగన్ తోడబుట్టిన అన్నయ్య. ఆ అన్నయ్యకు నష్టం జరగకూడదని ఆడకూతురుగా షర్మిల భావించాలి. అందుకే ఏపీ రాజకీయాలు పూర్తిగా అన్న జగన్ కు వదిలేసి తెలంగాణకు వచ్చేసింది. నిజానికి సీఎంగా గెలిచాక జగన్ తన కోసం.. తన పార్టీ కోసం ఎంతో పోరాడిన షర్మిలను అందలం ఎక్కించాల్సి ఉంది. జగన్ జైల్లో 16 నెలలు ఉంటే రాష్ట్రమంతటా పాదయాత్ర చేసి వైసీపీని బతికించింది. అలాంటి చెల్లికి ఓ ఎంపీ సీటు ఇచ్చో కేంద్రంలో కీలక పదవి ఇచ్చో జగన్ ఆమెను కీలక స్థానంలో కూర్చుండబెట్టాల్సింది. కానీ అది చేయలేదు. దీంతో ఆ అసంతృప్తి బయటపడి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో జగన్ కు ఇష్టం లేకున్నా షర్మిల బయటకు వచ్చి పోరాడుతున్న పరిస్థితి నెలకొంది. జగన్ సామాజిక న్యాయం పేరుతో చెల్లిని పక్కనపెట్టొచ్చు తప్పులేదు. కానీ పోరాడిన చెల్లిని అలా తీసిపారేయడం కూడా కరెక్ట్ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.

-జగన్ ది తప్పు.. మరి షర్మిల దేంటి?
జగన్ జైల్లో ఉన్నప్పుడు వైసీపీని బతికించింది షర్మిల. ఆమెకు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏమాత్రం ప్రాధాన్యత దక్కలేదన్నది వాస్తవం. షర్మిల కే కాదు.. జగన్ తో కలిసి పోరాడి.. అసెంబ్లీలో బహిష్కరణకు గురై జైలుకు కూడా వెళ్లిన రోజా, అంబటి రాంబాబు, కరుణాకర్ రెడ్డి సహా చాలా మంది ఫైర్ బ్రాండ్లకు మంత్రి పదవులు దక్కక వారంతా అసంతృప్తితో ఉన్నారు. సామాజికన్యాయం పేరిట.. పార్టీ కోసం పోరాడిన వారిని పక్కన పెట్టడం నిజంగా జగన్ చేసిన తప్పు. అయితే ఆ తప్పును అంగీకరించలేని షర్మిల.. జగన్ కు ఇష్టం లేకున్నా బయటకొచ్చింది.. తెలంగాణలో పార్టీ పెట్టింది. ఆమెకు సొంత సాక్షి మీడియా నుంచి నిరాదరణ ఎదురైంది. ఈ క్రమంలోనే తనకు తెలంగాణలో మైలేజ్ వచ్చేందుకు జగన్ పగవాడు.. శత్రువుగా భావించే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పంచన చేరడమే వైఎస్ అభిమానులను జీర్ణించుకోవడం లేదు. ఎంత విభేదాలున్నా.. ఎన్ని కొట్లాటలు ఉన్నా కూడా పగవాడికి ఫ్యామిలీ సీక్రెట్స్.. గొడవలు, అలకలు చెప్పడమే ఇక్కడ షర్మిల చేస్తున్న అతిపెద్ద తప్పుగా అభివర్ణిస్తున్నారు. జగన్ చేసింది తప్పే.. కానీ అంతకంటే తప్పు షర్మిల చేస్తుందని అర్థమవుతోంది.

తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో షర్మిల ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ పున: ప్రారంభంలో తొలి ఎపిసోడ్ కు రావడం చూసి అంతా షాక్ అయిన పరిస్థితి నెలకొంది. మరి ఇందులో ఏమేం చెప్పింది? అవి జగన్ ఫ్యామిలీని ఎంత షేక్ చేస్తాయన్నది వేచిచూడాలి.

  • ఏబీఎన్ ఆర్కేతో వైఎస్ షర్మిల ఇంటర్వ్యూ వీడియో ప్రోమో
NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular