Homeఆంధ్రప్రదేశ్‌YouTuber Anvesh: ఆ ప్రపంచ యాత్రికుడు టీడీపీ మనిషా.. లోకేష్ 5 కోట్లు ఇచ్చాడా?

YouTuber Anvesh: ఆ ప్రపంచ యాత్రికుడు టీడీపీ మనిషా.. లోకేష్ 5 కోట్లు ఇచ్చాడా?

YouTuber Anvesh: ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్. మన తెలుగు వారందరికీ సుపరిచితమే. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచ దేశాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంటాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రదేశాలు వీక్షకులకు చూపిస్తుంటాడు. రీసెంట్ గా చేసిన చైనా సిరీస్ సూపర్ హిట్ అయింది. ఒక్క నెలలోనే 30 లక్షల రూపాయలు ఆర్జించినట్లు వార్తలు వచ్చాయి. ఈ యుట్యుబర్ ను చూసి చాలామంది యూట్యూబ్ ఛానళ్లను ప్రారంభించారు. యూట్యూబ్ ద్వారా లక్షలు సంపాదించడం ఎలా? అన్న కోర్సులు సైతం అందుబాటులోకి వచ్చే అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే యూట్యూబర్ కి టిడిపి యువనేత నారా లోకేష్ రూ. 5 కోట్లు ఇచ్చాడంటూ ప్రచారం జరుగుతోంది. ఓ వీడియో రూపొందించినందుకు గాను ఈ మొత్తాన్ని ముట్టచెప్పినట్లు టాక్ నడుస్తోంది.

ఎవర్రా మీరంతా అంటూ సోషల్ మీడియాలో అన్వేష్ సందడి చేస్తుంటాడు. ప్రపంచ దేశాలను అన్వేషించే క్రమంలో.. ఇటీవల జింబాబ్వేను సందర్శించాడు. అక్కడ ఉచిత పథకాల ద్వారా జింబాబ్వే ఆర్థిక వ్యవస్థ ఎలా కుప్పకూలిపోయిందో ఓ వీడియోలో చూపించాడు. రాబోయే రోజుల్లో ఏపీ కూడా ఉచిత పథకాలతో జింబాబ్వే మాదిరిగా మారబోతుందని హెచ్చరించాడు. అయితే ఇప్పటివరకు అన్వేష్ ఈ తరహా విమర్శలు చేయలేదు. వివాదాస్పద అంశాల జోలికి పోలేదు. దీంతో దీనిపై విమర్శలతో పాటు రకరకాల అనుమానాలు ప్రారంభమయ్యాయి.

ముఖ్యంగా వైసీపీ నేతలు అన్వేష్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీని వెనుక నారా లోకేష్ ఉన్నారని ఆరోపిస్తున్నారు. రూ. 5 కోట్లు ఇచ్చి లోకేష్ ఈ వీడియో తయారు చేయించారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అటు అన్వేష్ తీరుపై సైతం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆయనకు ఆర్థిక, రాజకీయాలపై ప్రాథమిక అవగాహన లేదని పలువురు నిందిస్తున్నారు. ప్రయాణాల పట్ల అన్వేష్ కు ఉన్న శ్రద్ధ, ఆసక్తి విషయంలో అభినందిస్తూనే.. ఇటువంటి వివాదాస్పద అంశాల జోలికి వెళ్లడం తగదని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జింబాబ్వేలో అన్వేష్ ఉన్నారు. ఇప్పుడు ఆయన చుట్టూ రాజకీయ వివాదాలు అలుముకోవడం విశేషం.

ఈ విషయంలో లోకేష్ పేరు బయటకు రావడంతో వైసిపి సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. ఒక్క వీడియోకు లోకేష్ 5 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం చూస్తుంటే పరిస్థితి అర్థం అవుతుందని విమర్శలు గుప్పిస్తోంది. ఈ తరుణంలో నారా లోకేష్ స్పందించారు. ” వైసీపీ ఇచ్చే రూ.5 పేటీఎం కోసం కొందరు ప్రశ్నిస్తున్న వారిని నిందిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్ పై ‘ నా అన్వేషణ’ ఛానల్ చేసిన వీడియో ప్రశంసించదగినది ” అని ఎక్స్ లో ట్విట్ చేశారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. అయితే దీనిపై వైసీపీ సోషల్ మీడియా భిన్నంగా స్పందిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular