Homeఆంధ్రప్రదేశ్‌రఘురామ కట్టడికే వైసీపీ ముప్పేట దాడి

రఘురామ కట్టడికే వైసీపీ ముప్పేట దాడి

MP Raghurama Krishna Raju

రఘురామ కృష్ణంరాజు విషయంలో వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఆయనపై ఎలాగైనా వేటు వేయంచాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే స్పీకర్ తో నోటీసు ఇప్పించి ఒకింత విజయం సాధించింది. అయినా ఇంకా ఆయనను పార్లమెంట్ కు రానివ్వకుండా చేయడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంది. రఘురామపై వేటు వేయించే క్రమంలో బీజేపీపైనే ఒత్తిడి పెంచే పనిలో పడింది. 22 మంది ఎంపీలు కలిగి ఉన్న పార్టీగా గుర్తింపు ఉన్నా తమకు కావాల్సిన పనులు చేయించుకోవడంలో విఫలమవుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఢిల్లీ వేదికగా వైసీపీ రఘురామ వ్యవహారాన్ని తేల్చుకోవాలని భావిస్తోంది. రెండేళ్లలో వైసీపీలో ఇంత చురుకుదనం కనిపించలేదు. కానీ ఇప్పుడు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఎలాగైనా తమ పనులు పూర్తి చేసుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఇన్నాళ్లు పట్టించుకోకుండా పోయినా ప్రస్తుతం రఘురామ వ్యవహారంపై మాత్రం మంకు పట్టు పడుతోంది.

ఇప్పటికే ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు ఇప్పించడంతో వైసీపీ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. రఘురామ వివరణ అందిన తరువాత ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దానిపై ఆలోచిస్తోంది. రఘురామతోపాటు మరో ఇద్దరు ఎంపీపై కూడా నోటీసులు జారీ కావడంతో వారు ఇచ్చే సమాధానాల తరువాత వారి దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

రఘుురామను అన్ని దారుల్లో అష్టదిబ్బంధనం చేసి కట్టడి చేసే క్రమంలో వైసీపీ పలు మార్గాలు యోచిస్తోంది. ఆయన కంపెనీలపై ఫిర్యాదులు చేసి వాటి మనుగడను దెబ్బతీసే పనిలో నిమగ్నమైంది. ఎలాగైనా ఎంపీ రఘురామ దూకుడు తగ్గించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనపై ఆర్థికపరమైన చిక్కులు కల్పిస్తే ఆయన మన మార్గంలోకి వస్తారనే ఊహల్లో వైసీపీ ఊగిసలాడుతోంది. రఘురామపై జగన్ పట్టు వీడే అవకాశమే లేదని చెబుతోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular