ycp attack on bjp leader
Ycp Attacks:తమకు ఎదురునిలబడితే ఎవ్వరినీ ఉపేక్షించడం లేదని భావిస్తోంది ఏపీలోని అధికార వైసీపీ పార్టీ. మొన్న నిలదీసిన పవన్ ను బజారుకీడ్చారు. నిన్న ప్రశ్నించిన టీడీపీ పని పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లను ధ్వంసం చేశారు. తాజాగా బద్వేలులో బరిలో ఉన్న బీజేపీకి మద్దతుగా ప్రచారానికి వచ్చిన బీజేపీ నేత కారుపై రాళ్ల దాడి చేశారు. ఏపీలో వైసీపీ కార్యకర్తలు, నేతల ఆగడాలు మరీ పెచ్చు మీరిపోయాయని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
ycp attack on bjp leader
బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలం లో రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు శశిభూషన్ రెడ్డి గారు ప్రచారానికి వెళుతుండగా వైసీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేయడం కలకలం రేపింది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. వైసీపీ అరాచకానికి దౌర్జన్యానికి బీజేపీ కార్యకర్తలు నాయకులు ఎవరు భయపడరని స్పష్టం చేశారు. మీ రౌడీయిజానికి కాలం దగ్గర పడిందన్నారు. వచ్చే బద్వేల్ ఉప ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సోము వీర్రాజు హెచ్చరించారు.
ఇప్పటికే వైసీపీ దాడులు కలకలం రేపుతున్నాయి. వైసీపీ ఎదురుదాడి రాజకీయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిన్న టీడీపీ నేత పట్టాభి విమర్శలకు రెచ్చిపోయి టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లను ధ్వంసం చేసింది. తాజాగా బీజేపీ నేతలపై కూడా దాడులు చేయడం సంచలనమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలపై దాడులు చేయడం విస్తుగొలుపుతోంది.
బద్వేలు బరిలో టీడీపీ, జనసేన వైదొలిగినా బీజేపీ, కాంగ్రెస్ లు పోటీచేస్తున్నాయి. అయితే ఇక్కడ వైసీపీకి ఎదురొడ్డి నిలిచే పార్టీ ప్రస్తుతానికి లేదు. అంతో ఇంతో బీజేపీనే పోటీనివ్వగలదు. అక్కడ బీజేపీ నేతల మోహరింపును జీర్ణించుకోలేని వైసీపీ ఈ దాడులకు దిగినట్టు తెలుస్తోంది.