Telangana New Secretariat: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నూతన సెక్రటేరియట్ ను ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో నూతన సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలను శోభాయమానంగా తీర్చిదిద్దారు. తెలుపు వర్ణంతో నూతన సచివాలయం అమెరికా వైట్ హౌస్ లాగా మెరిసిపోతోంది. ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఏర్పాట్లు దగ్గరుండి చూస్తున్నారు. నూతన సచివాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఏఏ ప్రాంతాల్లో అంటే..
ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబిని పార్క్ మార్గాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను ట్యాంక్ బండ్ వైపు అనుమతిస్తారు. పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్ వైపు అనుమతిస్తారు. చింతల్ బస్తీ నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్డు వైపు అనుమతిస్తారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను ట్యాంక్ బండ్, రాణి గంజ్, లిబర్టీ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్, అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్ వైపు అనుమతిస్తారు. కట్ట మైసమ్మ జంక్షన్, లోయర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పైనుంచి అనుమతిస్తారు.
అలాగే బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలను అనుమతిస్తారు. తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మీనార్ జంక్షన్ వైపు వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళించరు. ఖైరతాబాద్ గణేష్ మార్గం నుంచి వచ్చే వాహనాలను ఐమాక్స్, నెక్లెస్ రోడ్డు వైపు వచ్చే ట్రాఫిక్, బడ గణేష్ వద్ద రాజ్ దూత్ లైన్ వైపు మళ్లిస్తారు. అయితే ట్రాఫిక్ ఆంక్షలు నేపథ్యంలో ఈ మార్గాలలో కాకుండా ప్రయాణికులు ఇతర మార్గాలలో వెళ్తే ఉపయుక్తంగా ఉంటుంది.
లుంబిని పార్క్ మూసివేత
సచివాలయం ప్రారంభోత్సవ నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలను తమ అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు సచివాలయం ప్రారంభోత్సవానికి హాజరవుతున్న నేపథ్యంలో తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సచివాలయం ప్రాంతంలో బయటివారిని ఎవరినీ కూడా అనుమతించడం లేదు. హైదరాబాదులో ఆదివారం లుంబిని పార్కును సైతం మూసివేస్తున్నారు.
K.R. is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More