ఏపీ ముఖ్యమంత్రి జగన్ – వైసీపీ నేత విజయసాయిరెడ్డి మధ్య బంధం ఎలాంటిదో అందరికీ తెలుసు. ఆయనను జగన్ మనసెరిగిన నేతగా చెబుతారు. పార్టీలోనూ విజయసాయి ప్రాధాన్యం పెద్దదే. పార్లమెంటరీ పార్టీ నేతగా చక్రం తిప్పుతున్నారు. ఉత్తరాంధ్రలో పార్టీ బాధ్యతను కూడా విజయ సాయికే అప్పగించారు జగన్. అయితే.. కొంతకాలంగా తనకు ఎదురు లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే పేరు వచ్చింది. ఈ పరిస్థితి రానురానూ ముదరడంతో జగన్ తిప్పలు వచ్చి పడుతున్నాయని అంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చర్చలోకి వచ్చిన మాన్సాస్ ట్రస్టు వివాదానికి విజయసాయిరెడ్డే కారణమని దాదాపుగా విపక్షాలన్నీ అంటున్నాయి. క్షత్రియవర్గంతోపాటు సాధారణ ప్రజల్లోనే ఇదే అభిప్రాయం ఉందని అంటున్నారు. మాన్సాస్ చైర్ పర్సన్ మార్పు విషయంలో ఓ స్వామీజీ చెప్పిన మాటను పట్టుకుని ఆయన.. ఇంత దాకా తెచ్చారని అంటున్నారు. ఆ విధంగా పార్టీకి.. ఏ మాత్రం సంబంధం లేని, అసలు అలాంటి ఆలోచనే చేయని విషయాన్ని నెత్తిమీదకు తెచ్చారని అంటున్నారు.
రాజకీయంగా వైసీపీకి ఇది ఇబ్బందికర పరిణామమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. న్యాయస్థానం కూడా ఈ విషయమై ప్రభుత్వానికి వ్యతిరేక వ్యాఖ్యలే చేసింది. విపక్షాలతోపాటు ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చిందనే ప్రచారం ఉంది. కాపు నేత ముద్రగడ పద్మనాభం కూడా ఈ విషయంలో జగన్ కు బహిరంగ లేఖ రాయడం.. విజయ సాయిరెడ్డి తీరును తప్పుబట్టడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ వైసీపీకి చిక్కులు తెచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయంలో జగన్ విజయసాయి పట్ల అసహనంగానే ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే.. తాజాగా లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకి విజయసాయి రెడ్డి రాసిన లేఖ కూడా చర్చనీయాంశంగా మారింది. ఎంపీ రఘురామ పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. పట్టించుకోవట్లేదని, విజయసాయిరెడ్డి ఒకింత అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. అయితే.. జగన్ పై ఉన్న కేసుల దృష్ట్యా కేంద్రంతో సఖ్యతగా ఉండాల్సిందే. మరి, ఇలాంటి సమయంలో ఈ తరహా లేఖలు రాయడం ఇబ్బందికరమేనని అంటున్నారు. మొత్తంగా.. విజయసాయిరెడ్డి చర్యలు చాలా వరకు వైసీపీకి నెగెటివ్ గానే కనిపిస్తున్నాయి. మరి, ఇది పార్టీ లైనేనా? లేదా విజయసాయి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారా? అన్నది తేలాల్సి ఉంది.