Vangaveeti Radha Marriage: వంగవీటి మోహన్ రంగ తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, పుష్పవల్లిల వివాహం ఘనంగా జరిగింది. కృష్ణాజిల్లా పోరంకిలోని ఎం రిసార్ట్స్ లో జరిగిన ఈ వేడుకల్లో వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. వివాహ ప్రాంగణం భారీ జన సందోహంతో కిక్కిరిసింది.అన్ని రాజకీయ పక్షాల నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వంగవీటి రాధా 2004లో రాజకీయ అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసివిజయం సాధించారు. 2009 పిఆర్పి ఆవిర్భవించడంతో ఆ పార్టీలో చేరారు. అటు తరువాత వైసిపిలో చేరారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ నిరాకరించడంతో తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. ప్రస్తుతం తెలుగుదేశం లోనే కొనసాగుతున్నారు. జనసేన నాయకుడు బాబ్జి, అమ్మానీ దంపతుల కుమార్తె పుష్పవల్లితో కొద్దిరోజులు కిందట వివాహం నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పుష్పవల్లి మెడలో రాధాకృష్ణ తాళికట్టారు. దంపతులు ఒక్కటయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి రంగా అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడం విశేషం.
వివాహ వేడుకలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ తో వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్, విజయవాడ ఎంపీ కేసినేని నానితో పాటు అన్ని పార్టీల నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.