కరోనాపై పోరులో అగ్రరాజ్యం అమెరికా అద్వితీయమైన ప్రగతిని సాధించింది. టీకా పంపిణీకి పటిష్టమైన ప్రణాళికలు రూపొందించిన అగ్రరాజ్యం.. దాన్ని పక్కాగా అమలు చేసి, ఫలితం సాధించింది. తాజా సమాచారం ప్రకారం ఆ దేశంలో వ్యాక్సిన్ అర్హత ఉన్నవారిలో ఏకంగా 50 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ వేసినట్టు తెలుస్తోంది. ఒకడోసు వ్యాక్సిన్ తీసుకున్నవారైతే 70 శాతానికి మించి ఉన్నారట. దీంతో.. కరోనాను యూఎస్ సమర్థంగా ఎదుర్కొందనే అభినందనలు కురుస్తున్నాయి.
ట్రంప్ ముందు వరకు పరిస్థితి ఎలా ఉన్నా.. బైడెన్ వచ్చిన తర్వాత ప్రణాళిక ప్రకారం కరోనాపై పోరాటం మొదలు పెట్టారు. జనవరి 20వ తేదీన బైడెన్ దేశాధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. అప్పటికే ఆ దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. దీంతో.. బైడెన్ ఎంచుకున్న ప్రధాన లక్ష్యాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కూడా ఒకటి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల్లోనే 100 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
పక్కా ప్రణాళికతో కార్యక్రమాన్ని కొనసాగించిన ప్రభుత్వం.. అనుకున్న సమయానికి ముందుగానే టార్గెట్ ను చేరుకుంది. దీంతో.. ఈ లక్ష్యాన్ని 200 మిలియన్ డోసులకు పెంచారు. ఆ లక్ష్యాన్ని కూడా ఏప్రిల్ మధ్య భాగానికే చేరుకున్నారు. ఈ విషయాన్ని బైడెన్ అధికారికంగా ప్రకటించింది ఆనందం వ్యక్తంచేశారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరును ప్రశంసించారు.
ప్రస్తుత సమాచారం ప్రకారం 50 శాతం మందికిపైగా రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వడం గొప్ప విషయంగా అభివర్ణిస్తున్నారు. సింగిల్ డోస్ 70 శాతం మందికిపైగా తీసుకోవడంతో.. ఇక కరోనా పోరులో దాదాపుగా విజయం సాధించినట్టేనని అంటున్నారు. రెండు డోసుల ఎక్కువగా ఇచ్చిన రాష్ట్రాల్లో.. మాస్కులు తీసేయడం, భౌతిక దూరాన్ని కూడా పక్కన పెట్టే ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం అమెరికాలో కొవిడ్ కేసులు రోజుకు 20 వేల వద్ద నమోదవుతున్నాయి. వ్యాక్సినేషన్ ఇంకా కొనసాగిస్తున్న నేపథ్యంలో.. ఈ కేసుల సంఖ్య కూడా తగ్గిపోతుందని చెబుతున్నారు. తద్వరా.. తొలిదశలో కరోనా దెబ్బకు వణికిపోయిన అగ్రరాజ్యం.. ఇప్పుడు మహమ్మారిపై విజయానికి చేరువలో ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.