Homeఅంతర్జాతీయంCanada PM Trudeau: ట్రూడో వ్యాఖ్యల వెనుక ఖలిస్థానీ ప్రమేయం?.. కెనడాతో ముదురుతున్న వివాదం..

Canada PM Trudeau: ట్రూడో వ్యాఖ్యల వెనుక ఖలిస్థానీ ప్రమేయం?.. కెనడాతో ముదురుతున్న వివాదం..

Canada PM Trudeau: కెనడా ప్రధానమంత్రి ట్రూడో చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఫలితం.. కెనడా, భారత్ ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆరోపణలు, ప్రఖ్యారోపణలు చేసుకునే దశ దాటిపోయి దౌత్యాధికారులను పరస్పరం బహిష్కరించుకునే పరిస్థితి వచ్చింది. దీని అంతటికి కారణం సిక్కు ఉగ్రవాద సంస్థ ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్(45) హత్యకు గురి కావడమే. ఏడాది జూన్ 18న కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రం సర్రే లో ఒక గురుద్వారా బయట హర్దీప్ ను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కెనడా నుంచి పనిచేస్తున్న కేటీఎఫ్ ను భారత ప్రభుత్వం గతంలోని నిషేధించింది. హార్దీప్ ను కరుడుగట్టిన ఉగ్రవాదిగా పేర్కొంటూ అతని తలపై పది లక్షల రివార్డు ప్రకటించింది.

హార్దీప్ హత్యకు గురైన నేపథ్యంలో భారత్_కెనడా మధ్య సంబంధాలు తీవ్ర కుదుపునకు లోనవుతున్నాయి. సోమవారం కెనడా పార్లమెంటులో ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన ప్రకటనతో పరిస్థితులు మరింత క్షీణించాయి. “కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు, భారత ప్రభుత్వ ఏజెంట్లకు మధ్య సంబంధం ఉందన్న ఆరోపణలపై కెనడా దర్యాప్తు సంస్థలు గత కొన్ని వారాలు గట్టిగా దర్యాప్తు చేస్తున్నాయి. కెనడా గడ్డమీద కెనడా పౌరుడు ని హత్య చేసిన ఘటనలో ఒక విదేశీ ప్రభుత్వానికి ప్రమేయం ఉండటం ఈ దేశ సార్వభౌమాధికారానికి భంగకరం అని” ట్రూడో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కెనడా విదేశాంగ మంత్రి మేళానిజోలి తమ దేశంలోని భారత రాయబార కార్యాలయం నుంచి సీనియర్ అధికారి పవన్ కుమార్ రాయ్ ని బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పవన్ కుమార్ కెనడాలో భారత గూడచారి సంస్థ (రా) అధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే కెనడా తీసుకున్న తీవ్రమైన చర్యకు భారత్ ప్రతిస్పందించింది. ఢిల్లీలోని కెనడా రాయబార కార్యాలయం నుంచి ఆ దేశ గూడచార సంస్థ విభాగాధిపతి ఒలివర్ సిల్వస్టర్ ను బహిష్కరిస్తూ.. ఐదు రోజుల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది.

కెనడా ప్రధాని వ్యాఖ్యల పట్ల భారత విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. కెనడాలో జరిగిన హింసను భారత్ కు ముడిపెట్టడం ఏంటని ప్రశ్నించింది.”కెనడాలో ఆశ్రయం పొందుతూ భారత సార్వభౌమాధికారానికి, సమగ్రతకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సిక్కూ ఉగ్రవాదులు, వేర్పాటు వాద శక్తుల పట్ల ప్రభుత్వం సానుభూతి చూపడం దారుణం. ఇటువంటి దురాగతాన్ని భారతదేశానికి అంటగట్టడం సరికాదని” భారత విదేశాంగ శాఖ అధికారులు మండిపడ్డారు. ఈ వివాదంపై కెనడా ప్రధానమంత్రి తమ సన్నిహిత దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల అధినేతలతో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు కెనడా ప్రధాని తాను చేసిన వ్యాఖ్యల అట్లా మంగళవారం స్పందించారు. భారతదేశాన్ని రెచ్చగొట్టడానికి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని ప్రకటించుకున్నారు. భారత్ సరైన విధంగా స్పందిస్తుందని ఆశించి తాను ఆ వ్యాఖ్యలు చేసినట్టు చెప్పారు. అయితే కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. కెనడాలో ఉన్న భారత రాయబార కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టాలని సిక్కులు నిర్ణయించుకున్నారు. కెనడా దేశంలో 7.7 లక్షల మందికి పైగా సిక్కులు ఉన్నారు.

అయితే ఈ విదేశాలు దౌత్యాధికారులను బహిష్కరించుకున్న నేపథ్యంలో వాణిజ్య సంబంధాలకు సంబంధించి చర్చ మొదలైంది. ఈ ఏడాది ఇరుదేశాల మధ్య వాణిజ్యం 816 కోట్ల డాలర్లకు చేరుకుంది. కెనడాకు భారత్ ఔషధాలు, వజ్రాలు, ఆభరణాలు, వస్త్రాలు, యంత్రాలు ఎగుమతి చేస్తోంది. భారత్ కు కెనడా పప్పులు, కలప, కాగితం మొదలైనవి ఎగుమతి చేస్తోంది. గత ఏడాది భారత్ లో కెనడా పెన్షన్ నిధి నుంచి 4500 కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టారు. మరోవైపు విద్యారంగంలో కూడా ఇరు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం ఉంది. కెనడాలో 3.2 లక్షల మంది భారతీయ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 2021 లో భారతీయ విద్యార్థుల ద్వారా కెనడాకు 490 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular