
టిఆర్ఎస్ నేతకు తెలంగాణ మంత్రి కేటీఆర్ రూ.20వేల జరిమానా విధించిన సంఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకుంది. కేటిఆర్ కి స్వాగతం పలికే క్రమంలో ఆ నేత రూల్స్ ని బ్రేక్ చేయడంతో ఆమెకు జరిమానా విధించడం జరిగింది. స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నాయకుల తీరుపై మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఆయన మండిపడ్డారు. ఎర్రగడ్డ కార్పొరేటర్ షాహీన్ బేగంకు రూ.20వేల జరిమానా వేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. అంతేకాదు మాస్క్ లేకుండా కార్యక్రమానికి వచ్చినందుకు కార్పొరేటర్ భర్త షరీఫ్ కు రూ.వెయ్యి జరిమానా వేయాలని సూచించారు. కార్పొరేటర్ దంపతులకు జరిమానా విధించాలని జీహెచ్ఎంసీ అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డలోని యాదగిరి నగర్, సుల్తాన్ నగర్ బస్తీల్లో మంత్రి కేటీఆర్ బస్తీ దవాఖానలు ప్రారంభించారు.
నగరంలో ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని గతంలోనే మంత్రి కేటిఆర్ తమ పార్టీ నేతలను ఆదేశించిన విషయం తెలిసిందే..