విశాఖపట్నం నగరంలోని పారిశ్రామిక ప్రాంతంలో వెలువడిన దట్టమైన పొగలు విశాఖ వాసులను మరోసారి భయ భ్రాంతులకు గురిచేశాయి. ఎల్.జి పరిశ్రమ నుంచి స్టైరీన్ లీకయిన నాటి నుంచి విశాఖ వాసులు ఎక్కడ గ్యాస్ లీక్ అయినా, పొగలు కమ్ముకున్నా ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అయితే మల్కాపురంలోని హెచ్పీసీఎల్ రిఫైనరీ గొట్టాల నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. విశాఖ మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న హెచ్పీసీఎల్ రిఫైనరీలో ఎన్హెచ్యూను తెరిచేందుకు సంస్థ సన్నాహాలు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో భారీ ఎత్తున తెల్లని పొగ అలుముకోవడంతో ఎన్ఏడీ, మర్రిపాలెం, కంచరపాలెం వాసులు భయాందోళనకు గురై ఇళ్ల నంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.
సంఘటనపై హెచ్పీసీఎల్ యాజమాన్యం స్పందిచింది. రిఫైనరీలో ఎన్హెచ్యూను తెరిచే క్రమంలో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు గుర్తించాం. దీంతో వెంటనే పరిస్థితిని చక్కదిద్దాం. పొగ కొద్దీ సేపు మాత్రమే వచ్చిందని, దాన్ని వెంటనే అదుపు చేసినట్లు తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని హెచ్పీసీఎల్ ప్రతినిధి వివరించారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన మరవక ముందే అలాంటి ఘటన మరొక్కటి చోటుచేసుకోవడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే నిమిషాల వ్యవధిలోనే పొగ తీవ్రత తగ్గిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పరిశ్రమ పునఃప్రారంభం చేసే సమయంలో యాజమాన్యం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఈ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
Thick plumes of smoke billowing out of the HPCL factory in Vizag worried residents living around the same locality. It brought back memories of the Styrene gas leak from LG Polymers. The situation is now back to normal. No reason to worry. #AndhraPradesh pic.twitter.com/fi8cW5dMyD
— Paul Oommen (@Paul_Oommen) May 21, 2020