Balineni Srinivasa Reddy
Balineni Srinivasa Reddy: సీఎం బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గత కొంతకాలంగా పార్టీలో అసంతృప్తి పల్లవి వినిపిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బంధువు అన్నమాట కానీ జగన్ కు చికాకు తెప్పిస్తున్నారు. దీంతో బాలినేనిని వదులుకుంటే మేలన్న నిశ్చయానికి జగన్ వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల మార్పుల జాబితాలో బాలినేని సైతం ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఒప్పుకుంటే స్థానచలనం.. లేకుంటే పక్కన పెట్టడం అన్న రేంజ్ లో జగన్ ఆలోచన ఉన్నట్లు సమాచారం. అందుకే పార్టీలో ఉండడం కంటే బయటకు వెళ్లడమే మేలని బాలినేని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
వైసిపి అంతర్గత సర్వేల్లో బాలినేనికి వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అక్కడ ప్రయోగం చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామును ఒంగోలుకు పంపించాలని చూస్తున్నారు. కానీ అందుకు బాలినేని ససేమిరా అంటున్నారు. అయితే హై కమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఇటీవల అర్ధరాత్రి వరకు ముఖ్య అనుచరులతో సమావేశం అయినా బాలినేని పార్టీ మారడం ఉత్తమమని తన భావాన్ని వ్యక్తపరిచినట్లు సమాచారం.
ప్రస్తుతం రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న విజయసాయిరెడ్డిని బాలినేని ప్రత్యేకంగా కలిశారు. కీలక చర్చలు జరిపారు. అయితే హై కమాండ్ ఆదేశాలను బాలినేని వద్ద విజయసాయిరెడ్డి ఉంచినట్లు తెలుస్తోంది. తాను ఎట్టి పరిస్థితుల్లో ఒంగోలు నుంచి కదిలేది లేదని.. ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ఆయన తెగేసి చెప్పినట్లు సమాచారం. కానీ ఈ చర్చల వివరాలేవీ బయటపడలేదు. ఇదే సమయంలో ఒంగోలు నుంచి టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగితే ఎలా ఉంటుందన్న ఆలోచన అనుచరుల వద్ద వ్యక్తపరిచినట్లు సమాచారం. దీనికి అనుచరుల నుంచి సానుకూల అభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తనకు టికెట్ విషయంలో పవన్ చంద్రబాబును ఒప్పించగలరా? అని బాలినేని అనుమానిస్తున్నారు. దీనిపై ఫుల్ క్లారిటీ వస్తే ఆయన జనసేనలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీలో దామచర్ల జనార్ధన్ పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకవేళ బాలినేని జనసేనలో చేరి, ఒంగోలు టికెట్ కేటాయిస్తే.. జనార్దన్ ను ఎంపీగా పోటీ చేయిస్తారని మరో ప్రచారం జరుగుతోంది. ఆయన ఎమ్మెల్యేగా ఉంటానని పట్టుపడితే కందుకూరుకు పంపే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని వ్యవహారంపై మూడు పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. పూర్తిగా గుంభనం పాటిస్తున్నాయి. బాలినేని మాత్రం హై కమాండ్ ఇస్తున్న ట్విస్టులతో రగిలిపోతున్నారు. పార్టీని వీడడం ఉత్తమమని భావిస్తున్నారు. కానీ ఇతర పార్టీల నుంచి సరైన ఆఫర్ వస్తేనే గోడ దాటాలని చూస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: The campaign that balineni srinivas reddy will join the janasena is going strong
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com