Telugu News Papers : ” సాక్షి మాస్టర్ హెడ్ పక్కనే వైఎస్ బొమ్మ వేసుకుంటుంది.. నమస్తే తెలంగాణ కెసిఆర్ సేవలో తరిస్తూ ఉంటుంది. ఇందులో వంక పెట్టేందుకు అవకాశం లేదు.. ఎందుకంటే అవి నేరుగానే చెబుతున్నాయి.. రాస్తున్నాయి.. ఇందులో ఎవరు ఏమనుకున్నా జానే దాన్. అవి ఎందుకు ఏర్పడ్డాయో, ఎవరికోసం ఏర్పడ్డాయో, ఎవరి ప్రయోజనాలను కాపాడేందుకు పనిచేస్తున్నాయో.. . ముంజేతి కంకణమే. కానీ ఎటోచ్చి ఈ పచ్చ మీడియాతోనే అసలు సమస్య. బాబుకు వ్యతిరేకంగా ఒక వార్త కూడా ప్రచురించవు. అదే ఆ బాబుకు అనుకూలంగా ఒక్క వార్త ఉన్నా కూడా వదిలిపెట్టవు. గల్లి స్థాయి నాయకుడు జగన్ ను విమర్శించినా, కెసిఆర్ ను తిట్టినా తాటి కాయంత అక్షరాలతో వార్తలను ప్రచురిస్తాయి. గాయి గత్తర చేస్తాయి. ఏదో జరగబోతోంది అనే భ్రమను కల్పిస్తాయి.
వాస్తవానికి మీడియా అనేది పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లడం ఎప్పుడైతే ప్రారంభమైందో… అప్పుడే విలువలు మొత్తం పడిపోవడం మొదలైంది.. బాకాలు, బాజాలు ఊదడం ప్రారంభమైంది. వాస్తవాలకు తిలోదకాలు ఇవ్వడం, సంచలనాలకు ప్రాధాన్యం ఇవ్వడం షురూ అయింది.. అందుకే మీడియా అంటే జనాల్లో పలుచన అయింది. ఇంత జరుగుతున్నా.. మీడియా సంస్థలు తమ ధోరణి మార్చుకోవడం లేదు. తాము ప్రచురిస్తున్న రంగుల మాదిరే వార్తలను కూడా ఏం మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ జాబితాలో పచ్చ మీడియాది అందె వేసిన చేయి. అటు జగన్, ఇటు పింక్ మీడియా జుజుబి. అధికారంలో ఉన్నప్పటికీ, అధికార పత్రికలు అనే పేరు పడినప్పటికీ.. పచ్చ మీడియాను ఇవి డామినేట్ చేయలేవు.. చేయబోవు.
-అవి వార్తలు కావా?
మన నెల్లూరులో ఆనం రామనారాయణరెడ్డి తాజాగా జగన్మోహన్ రెడ్డి పై నిరసనగళం వినిపించినప్పుడు సాక్షిలో సింగిల్ కాలం వార్త కూడా రాలేదు. అదే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో మాత్రం బీభత్సమైన వార్తలు ప్రసారమయ్యాయి. ఛానళ్ళు కూడా ఊదరగొట్టాయి. కానీ ప్రస్తుతం మైలవరం నియోజకవర్గంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం పార్టీని తూర్పారబడుతున్నాడు . కానీ దీనికి సంబంధించి ఒక వార్త కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కనిపించడం లేదు. అదే సాక్షిలో అయితే బ్యానర్ వార్త అవుతున్నది. ప్రజా సమస్యలు, ప్రజోపయోగ కోణాల నుంచి మీడియా దూరం జరుగుతున్నా కొద్దీ విలువలు వేగంగా పడిపోతున్నాయి. అందువల్లే జనంలో ఏవగింపు కలుగుతున్నది. పూర్వపు రోజుల్లో పత్రికలో జనాల్లో చైతన్యం కలిగించేవి.. జన సమస్యలను వెలుగులోకి తెచ్చేవి.. ప్రభుత్వాలను ఎడాపెడా కడిగి పారేసేవి.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయడం తప్ప.. వేరే లక్షమంటూ లేదు. ఒక నాలుగైదు పేపర్లు పక్క పక్కన పెట్టి చూసుకుంటే తప్ప అందులో ఏది వాస్తవమో… ఏది అవాస్తవమో తెలుసుకోలేని పరిస్థితి పాఠకులకు ఉంది.. అందు గురించే ప్రింట్ మీడియా తన విశ్వసనీయతను కోల్పోతున్నది. 2024 తర్వాత ప్రింట్ మీడియా దరిదాపు కనిపించదు. ఇందులో ఆశ్చర్యం కూడా ఏమీ లేదు.. ఎందుకంటే వాటి పిచ్చి రాతలు భరించలేని స్థాయికి పాఠకులు చేరిపోయారు.. ఇందుకు ప్రధాన కారణం ఈనాడు పత్రిక, ఆ తర్వాత ఆంధ్రజ్యోతి. వాటి బాటనే సాక్షి, నమస్తే తెలంగాణ అనుసరిస్తున్నాయి..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తన పోటీపత్రిక పాత ఆంధ్రజ్యోతిని మూసి వేసేందుకు ఈనాడు రామోజీరావు సారా వ్యతిరేక ఉద్యమం నడిపాడు.. ఎందుకంటే ఈ లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ ఆంధ్రజ్యోతిలో పెట్టుబడిగా పెడుతున్నాడని రామోజీరావు ఆరోపణ.. అందుకే సారా వ్యతిరేక ఉద్యమం నడిపి ఆంధ్రజ్యోతి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాడు.. దాసరి నారాయణరావు ఉదయం పై కూడా ఇలాగే కత్తి కట్టాడు. దానిని మూసేయించాడు.. వార్తపై కూడా ఇలాగే దుష్ప్రచారం చేశాడు.. ఇలాగే సాక్షిపై కూడా… ఆర్థిక మూలాలు బలంగా ఉండడంతో సాక్షి ఇబ్బంది పడటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ ద్వారా జగన్ మీద ఒత్తిడి తేవడం, ఖాతాలను ఫ్రీజింగ్ చేయడం… చాలా వ్యవహారాలే నడిచాయి.. చివరకు సాక్షి నిలబడింది.. కానీ పచ్చ మీడియాను ఎదుర్కోలేకపోతోంది. ఆ పచ్చ మీడియా ఇచ్చిన బలంతోనే చంద్రబాబు ఇంకా మనగలుగుతున్నాడు. చంద్రబాబును జాకీలు పెట్టి లేపే ప్రయత్నమే వాటి విధి కాబట్టి… ఆ రెండు పత్రికలు అలానే చేస్తాయి. అలానే రాస్తాయి.. జనం ఉమ్మేసినా వాటిలో మార్పు ఉండదు.. మార్పు రాదు. ఎందుకంటే అవి పెట్టుబడిదారుల విష పుత్రికలు. అలాగని మిగతావన్నీ సొక్కమని కాదు..