Telangana Government : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలు దోహదం చేశాయి. మహాలక్షి, గృహజ్యోతి, ఇందరిమ్మ ఇళు్ల, రైతు భరోసా, చేయూత, యువవికాసం పేరుతో నాడు టీపీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్రెడ్డి హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రకటించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయి ఉన్న తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలు ఆశాదీపంలా కనిపించాయి. ఇంకేముంది.. బీఆర్ఎస్ను గద్దె దించి.. కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారు. డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టారు. దీంతో ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారెంటీల అమలుపై కసరత్తు ప్రారంభించింది. డిసెంబర్ 9న ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించారు. ఈ క్రమంలో మరో ఐదు గ్యారంటీల అమలుకు డిసెంబర్ 28న రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ప్రజాపాలన పేరుతో దరఖాస్తుల స్వీకరణ..
డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజల వద్ద నుంచి ఐదు గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఐదు గ్యారంటీలకు సుమారు కోటి దరఖాస్తులు రాగా, మరో 25 లక్షల దరఖాస్తులు గ్యాంరటీల్లో లేని సమస్యలపై వచ్చాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ దరఖాస్తులను అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. జనవరి 17 నాటికి ఆన్లైన్ నమోదు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రాత్రి, పగలు తేడా లేకుండా అధికారులు ఆన్లైన్ నమోదు విధులు నిర్వర్తిస్తున్నారు.
దరఖాస్తు స్టేటస్ తెలుసుకునేలా..
ఐదు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకున్న వారంతా తమ దరఖాస్తు అప్రూవ్ అయిందా, రిజక్ట్ అయిందా తెలియక టెన్షన్ పడుతుంటారు. చాలా మంది ఈ సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ను రూపొందిస్తోంది. అభయహస్తం పథకం కింద దరఖాస్తులు ఇచ్చిన వారంతా తమకు ప్రజాపాలన కార్యక్రమంలో ఇచ్చిన రశీదు పత్రంలోని దరఖాస్తు నంబర్ నోయువర్ అప్లికేషన్ స్టేటస్ వెబ్సైట్లో ఎంటర్ చేసి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వ్యూ స్టేటస్ క్లిక్ చేయాలి. వెంటనే దరఖాస్తు అప్రూవ్ అయిందా లేక రిజక్ట్ అయిందా అనే తెలిసిపోతుంది.