Nara Lokesh Padayatra: లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపునకు టిడిపి భారీ ప్లాన్ చేస్తోంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో పాదయాత్ర ముగియనుంది. భారీ బహిరంగ సభ నిర్వహించాలని టిడిపి నిర్ణయించింది. అయితే ఈ సమావేశానికి పవన్ హాజరవుతారని తొలుత ప్రచారం జరిగింది. కానీ పవన్ హాజరు కావడం లేదని తాజాగా తెలుస్తోంది. దీంతో టిడిపి, జనసేన లో ఒక రకమైన ప్రచారం జరుగుతోంది.
ఈ ఏడాది జనవరి 27న లోకేష్ చిత్తూరు జిల్లా కుప్పంలో పాదయాత్ర ప్రారంభించారు. తొలుత రాయలసీమలో పాదయాత్రను పూర్తి చేశారు. కోస్తాలో సైతం పూర్తిచేసి గోదావరి జిల్లాల్లో అడుగుపెట్టారు. సరిగా రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర చేపడుతుండగా చంద్రబాబు అరెస్టు జరిగింది. దీంతో సెప్టెంబర్ 9న పాదయాత్ర నిలిచిపోయింది. 52 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో ఢిల్లీలో లోకేష్ కేసుల పర్యవేక్షణ చూశారు. చంద్రబాబు బెయిల్ పై విడుదలైన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. అయితే ముందుగా అనుకున్నట్టు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు కాకుండా.. విశాఖ జిల్లా తో ముగించాలని డిసైడ్ అయ్యారు. తొలుత భీమిలి నియోజకవర్గం అనుకున్నారు.. కానీ పక్కనే ఉన్న విజయనగరం జిల్లా భోగాపురంలో పాదయాత్ర ముగిస్తే.. 12 జిల్లాల్లో యాత్ర చేపట్టినట్టు అవుతుంది.
అయితే ముగింపు సభను భారీగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిడిపి శ్రేణులు ఐదు రైళ్లలో విశాఖకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిడిపి నాయకులు సైతం హాజరుకానున్నారు. ఇప్పటికే లోకేష్ పాదయాత్రలో పాల్గొనాలని జనసేన పార్టీ శ్రేణులకు పవన్ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఉన్నపలంగా పవన్ ఇప్పుడు ముగింపు సభకు హాజరు కావడం లేదని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. లోలోపల ఏం జరిగి ఉంటుందన్న అనుమానం వ్యక్తం అవుతోంది.
అయితే పవన్ కు ముందస్తు కార్యక్రమాలు ఖరారు అయినందునే హాజరు కావడం లేదని తెలుస్తోంది. లోకేష్ వ్యక్తిగత ఇమేజ్ పెంచే కార్యక్రమం కావడంతో పవన్ హాజరు కాలేదని మరో ప్రచారం జరుగుతోంది. పవన్ హాజరైతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతారని.. అందుకే ఆయన హాజరు కావడం లేదని తెలుస్తోంది. రెండు పార్టీల మధ్య ఉమ్మడి కార్యాచరణ ప్రారంభమైనా.. ఇరు పార్టీల అధినేతలు ఒకే వేదిక పైకి రావడం ఇంతవరకు జరగలేదు. యువగళం అనేది లోకేష్ కార్యక్రమం కావడంతో పవన్ వెనక్కి తగ్గారని… మరో వేదిక ద్వారా చంద్రబాబుతో వేదిక పంచుకోవాలని పవన్ డిసైడ్ అయినట్లు సమాచారం. అందుకే లోకేష్ పాదయాత్ర ముగింపునకు పవన్ దూరమైనట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.