అనంతపురం జిల్లా తాడిపత్రిలో మొదలైన రాజకీయ వివాదం కొనసాగుతూనే ఉంది. వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. టీడీపీ మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య సాగుతున్న ఈ పంచాయితీ.. ఇప్పుడు తారస్థాయికి చేరింది. జేసీ నిర్వహించాలని భావించిన మునిసిపల్ సమావేశానికి అధికారులు ఎవరూ హాజరు కాకపోవడంతో.. ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అధికారులు కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు.. సమావేశానికి గైర్హాజరైన అధికారులకు వంగి వంగి దండాలు పెట్టి, తన నిరసన తెలియజేశారు.
మునిసిపల్ చైర్మన్ హోదాలో జేసీ ప్రభాకర్ రెడ్డి సోమవారం ఉదయం పదిన్నర గంటలకు మునిసిపల్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆయన శనివారమే అధికారులకు తెలియజేశారు. అయితే.. ఇదే సమయంలో ఎమ్మెల్యే పెద్దారెడడ్ఇ మునిసిపల్ సిబ్బందితో కరోనా వైరస్ థర్డ్ వేవ్ పై అవగాహన ర్యాలీతోపాటు సమావేశం నిర్వహించడం గమనార్హం. దీంతో.. అధికారులు అనివార్యంగా ఎమ్మెల్యే సమావేశానికి హాజరయ్యారు.
అయితే.. కరోనా ర్యాలీ అనంతరం మునిసిపల్ అధికారులు వస్తారని జేసీ భావించి.. కౌన్సిలర్లతో కలిసి 12.30 వరకు కార్యాలయంలోనే ఉండిపోయారు. కానీ.. అధికారులు ఎవరూ రాలేదు. అంతేకాదు.. మునిసిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి మధ్యాహ్నం సెలవుపై వెళ్లిపోవడం గమనార్హం. దీంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన జేసీ.. ఆఫీసులో అలాగే ఉండిపోయారు. చివరకు సాయంత్రం 4 గంటలకు ఆఫీసుకు వచ్చారు కొందరు అధికారులు. వారికి వంగి వంగి దండాలు పెట్టిన, నిరసన తెలియజేశారు జేసీ.
ఇక, తాను సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు శనివారమే సమాచారం ఇచ్చినా.. తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా మునిసిపల్ కమిషనర్ సెలవుపై వెళ్లిపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆదేశాలను పట్టించుకోకుండా గైర్హాజరైన 26 మంది మునిసిపల్ సిబ్బంది కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
అంతేకాకుండా.. కమిషనర్ వచ్చే వరకు ఆఫీసును వదిలేది లేదంటూ.. రాత్రి భోజనం కూడా అక్కడే చేసి, కార్యాలయంలోనే నిద్రపోయారు చైర్మన్ ప్రభాకర్ రెడ్డి. దీంతో.. ఈ పంచాయతీ తారస్థాయికి చేరినట్టైంది. మునిసిపల్ కమిషనర్ ఎప్పుడు వస్తారు? వచ్చిన తర్వాత ఈ వ్యవహారం ఎటువైపు తిరుగుతుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.