Telangana Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిల్లో ఆసక్తికర విజయాలు, రికార్డు విజయాలు జరిగాయి. అయితే కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ ఓటర్లు మాత్రం తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఐదేళ్ల కోసారి తమ ఎమ్మెల్యేను 24 ఏళ్లుగా మారుస్తున్నారు. ఈసారి కూడా ఆదే సంప్రదాయం కొనసాగించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను ఓడించారు. కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం విజయం సాధించారు.
1999 నుంచి
చొప్పదండి నియోజకవర్గం 1957లో ఏర్పడింది. తొలుత జనరల్ నియోజకవర్గంగా ఉంది. తొలి ఎమ్మెల్యేగా సీహెచ్.రాజేశ్వర్రావు పీడీఎఫ్ నుంచి ఎన్నికయ్యారు. తర్వాత 1962లో జరిగిన ఎన్నికల్లో బి.రాములు కాంగ్రెస్ నుంచి గెలిచారు. 1978లో న్యాలకొండ శ్రీపతిరావు కాంగ్రెస్ ఐ నుంచి గెలిచారు. 1983లో గుర్రం మాధవరెడ్డి టీడీపీ నుంచి గెలిచారు.
1985 నుంచి మూడుసార్లు..
ఇక 1985లో జరిగిన ఎన్నికల్లోల టీడీపీ అభ్యర్థిగా రామకిషన్రావు గెలిచారు. ఈయన 1989, 1994లో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచారు. ఈ నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రామకిషన్రావు మాత్రమే.
1999 నుంచి ఎమ్మెల్యే మార్పు..
ఇక 1999 నుంచి ఎమ్మెల్యే మార్పు సంప్రదాయం కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో కె.సత్యనారాయణ గౌడ్ కాంగ్రెస్ ఐ నుంచి గెలిచారు. తర్వాత 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సానా మారుతి విజయం సాధించారు.
ఎస్సీ రిజర్వు..
ఇక 2009లో చొప్పదండిని ఎస్సీ రిజర్వు నియోజకవర్గంగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో సుద్దాల దేవయ్య టీడీపీ నుంచి గెలిచారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి బొడిగె శోభ విజయం సాధించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ బొడిగె శోభకు టికెట్ ఇవ్వలేదు. సుంకె రవిశంకర్ టీఆర్ఎస్ టికెట్పై పోటీ చేసి విజయం సాధించారు. అభ్యర్థి మార్పు సంప్రదాయం మేరకే టీఆర్ఎస్ బొడిగె శోభకు టికెట్ నిరాకరించింది. ఇక తాజాగా బీఆర్ఎస్ సంప్రదాయానికి విరుద్ధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కే టికెట్ ఇచ్చింది. పార్టీ నిర్ణయం తప్పని మరోసారి ఇక్కడి ఓటర్లు నిరూపించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యంను గెలిపించారు. 24 ఏళ్లుగా ఇక్కడి ఓటర్లు తమ ఎమ్మెల్యేను ఐదేళ్లకోసారి మారుస్తూనే ఉన్నారు.