SJP Protest: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, విద్యా వ్యవస్థలో లోపాలపై దాదాపు నెల రోజులు ఉద్యమించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా కాక్రోచ్ జనతాపార్టీ(సీజేపీ) చేసింది. రాజీనామా తర్వాత కేంద్రంతో సంభాషణల అనంతరం ఆందోళనను నిలిపివేసిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు హామీలు పాటించబడటం లేదని విమర్శలు చేస్తూ మరోసారి హెచ్చరికలు వెలువరిస్తోంది. తమ అవసరాలను నెరవేర్చి రాతపూర్వక హామీ ఇవ్వకపోతే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని స్పష్టం చేసింది.
ఉద్యమం తాత్కాలిక విరామం..
నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా జూన్ 20న మొదలైన ఈ ఉద్యమం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత జూలై 25న తాత్కాలికంగా ఆగిపోయింది. అనేక రాష్ట్రాల్లో విద్యార్థులు మద్దతు తెలిపి నిరసనలు చేపట్టగా వారిపై కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నమోదైన కేసులను రద్దు చేయాలని, నిర్బంధంలో ఉన్నవారిని వెంటనే విడుదల చేయాలని పార్టీ డిమాండ్ చేసింది. లేకపోతే మళ్లీ విస్తృత ఆందోళనకు సిద్ధమవుతామని సూచించింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో జరిగిన చర్చల్లో నిరసనకారులపై ప్రతీకార చర్యలు ఉండవని హామీ లభించినట్లు పార్టీ పేర్కొంది. అయినప్పటికీ బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం తదితర ప్రాంతాల్లో అరెస్టులు కొనసాగుతున్నాయని, ఢిల్లీలో వాలంటీర్లను వేధిస్తున్నారని ఆరోపించింది.
హామీ ఉల్లంఘనపై ఆగ్రహం
సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ కేంద్రం ముందు డిమాండ్లు ఉంచారు. ఇందులో నిరసనల్లో పాల్గొన్నవారిపై నమోదైన ఎఫ్ఐఆర్లను వెంటనే రద్దు చేయాలని, అరెస్టయిన విద్యార్థులను విడుదల చేయాలని కోరారు. హామీలపై లిఖితపూర్వక స్పష్టత కావాలని నొక్కి చెప్పారు. హామీలు అమలు కాకపోతే మళ్లీ జంతర్ మంతర్లో ఆందోళన ప్రారంభిస్తామని హెచ్చరించారు. విద్యార్థులు చర్చలను విశ్వసించి ఉద్యమాన్ని విరమించారని, ఇప్పుడు మాట తప్పడం లక్షలాది మంది యువత విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని అన్నారు.
బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం
పార్టీ హెచ్చరికల తర్వాత బిహార్ ప్రభుత్వం జూలై 26 సాయంత్రం 6 గంటల వరకు నిరసనలకు సంబంధించిన కేసుల ఉపసంహరణ ప్రక్రియను మొదలుపెట్టాలని ప్రకటించింది. నిర్బంధంలో ఉన్నవారిని విడుదల చేస్తామని, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేసింది. ఇక్కడ 335 మందిని అరెస్టు చేశారు. హింస, ఆస్తి నష్టం, పోలీసులపై దాడుల ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి.
పశ్చిమ బెంగాల్, అస్సాంలో పరిస్థితి
కోల్కతాలోని డొరినా క్రాసింగ్ వద్ద అనుమతి లేకుండా గుమిగూడి పోలీసులపై రాళ్లు, చెప్పులు, కర్రలు విసిరినట్లు ఆరోపిస్తూ ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 16 మందిని అరెస్టు చేశారు. కేసుల ఉపసంహరణపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ సలహా తీసుకుంటోంది. వ్యక్తిగత ఫిర్యాదుల ఆధారంగా నమోదైన కొన్ని కేసుల్లో నేరుగా ఉపసంహరణ సాధ్యం కాకపోవచ్చని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అస్సాంలో ప్రజా శాంతికి భంగం కలిగించారన్న ఆరోపణలతో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. లఖింపూర్ జిల్లాకు చెందిన ముగ్గురు వాట్సాప్ గ్రూప్ ద్వారా నిరసనకు మద్దతుగా ప్రజలను సమీకరించేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదు కేసులను ఉపసంహరించేందుకు చర్యలు ప్రారంభించింది. అరెస్టైన 13 మందిని విడుదల చేసే ప్రక్రియను మొదలుపెట్టామని, భవిష్యత్తులో ప్రతికూల చట్టపరమైన చర్యలు ఉండవని స్పష్టం చేసింది.
సోషల్ మీడియాపై నిఘా…
నిరసనల సమయంలో సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులపై ఢిల్లీ పోలీసులు దృష్టి సారించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు పంపారు. మధ్యప్రదేశ్లోని నివారీ జిల్లాలో ఒక కంటెంట్ క్రియేటర్పై ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ, ఢిల్లీ పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కేసు నమోదైంది. ముంబైలో కూడా నిరసనకారులకు నోటీసులు కొనసాగుతున్నాయి. అధికారిక ఉపసంహరణ ఉత్తర్వులు వచ్చే వరకు విచారణ కొనసాగుతుందని పోలీసులు చెబుతున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, కేరళ సహా పలు ప్రాంతాల్లోనూ కేసులు, అరెస్టులు జరిగాయి.
న్యాయ సహాయం
కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు సహాయం అందించేందుకు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ముందుకొచ్చారు. పార్టీ ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ ఫండ్కు రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయవాదులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
కేసుల ఉపసంహరణ, అరెస్టయిన విద్యార్థుల విడుదల అంత సులభమైన ప్రక్రియ కాదు. న్యాయపరమైన చిక్కులు, దర్యాప్తు దశలో ఉన్న కేసులు, రాష్ట్రాల వారీగా ఉన్న పరిస్థితులు కీలకంగా మారాయి. డిమాండ్లు నెరవేరకపోతే మళ్లీ జంతర్ మంతర్ వేదికగా ఆందోళనకు దిగుతామని పార్టీ స్పష్టం చేసింది. కేంద్రం ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలవుతాయి, విద్యార్థులపై నమోదైన కేసులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.