Shyam Sunder Paliwal tree planting: సాధారణంగా ఎవరైనా చనిపోతే.. ఆ కుటుంబం శోకంలో మునిగిపోతుంది. బంధుమిత్రులు కన్నీటి పర్యంతమవుతుంటారు. చుట్టుపక్కల వారు కూడా బాధపడుతుంటారు. కానీ ఈ కథనంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒక ఆడపిల్ల చనిపోతే.. ఊరు ఊరు మొత్తం పచ్చగా మారిపోయింది. ఇదేంటి ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా.. అయితే చదివేయండి ఈ కథనం..
రాజస్థాన్ రాష్ట్రంలో రాజ్ సమంద్ అనే జిల్లా ఉంది. ఇక్కడ పిప్లాంత్రి అనే గ్రామంలో శ్యాంసుందర్ అనే సర్పంచ్ ఉండేవాడు. ఈయన చిన్న కూతురు కిరణ్, అకాల మరణం చెందింది. కూతురు మరణించడంతో అతడు తీవ్రమైన దుఃఖానికి గురయ్యాడు. తన కూతురి జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటాలని నిర్ణయించుకున్నాడు. అది కాస్త ఒక ఆచారం లాగా మారిపోయింది. ఆడపిల్ల పుడితే చాలు 111 మొక్కలు నాటే కార్యక్రమానికి అక్కడి తల్లిదండ్రులు శ్రీకారం చుట్టారు.
ఏ ఇంట్లో నైనా ఆడపిల్ల పుడితే ఆమె భవిష్యత్తు కోసం గ్రామస్తులు, తల్లిదండ్రులు 31,000 వరకు విరాళాలు సేకరిస్తారు. బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. 18 సంవత్సరాల నిండిన తర్వాత ఆ డబ్బు ఆ అమ్మాయి చదువు లేదా పెళ్లికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఆడపిల్ల పుట్టినప్పుడు నాటిన మొక్కలు పర్యావరణానికి ఎంతో దోహదం చేస్తూ ఉంటాయి. ఇప్పటివరకు ఆ గ్రామంలో దాదాపు 350 కి పైగా మొక్కలను నాటారు. దీనివల్ల ఎడారిగా ఉన్న ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా పచ్చగా మారిపోయింది.
లింగసమానత్వం మనదేశంలో అంతగా లేదు. కానీ ఇక్కడ మాత్రం దేశానికి భిన్నంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆడపిల్ల పుడితే ఒక గొప్ప పండుగలాగా జరుపుకుంటారు. ఆడపిల్లల సంరక్షణ.. పర్యావరణ పరిరక్షణ అనే రెండు గొప్ప అంశాలను కొనసాగిస్తున్న ఈ గ్రామం ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. ఈ గ్రామం గురించి పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా ప్రత్యేకమైన కథనాలను రూపొందించాయి. ఒక మామూలు గ్రామం ఒక ఆడపిల్ల చనిపోతే ఉద్యమాన్ని మొదలుపెట్టింది. అది కాస్త ఎడారిని అడవిగా మార్చింది. అంతేకాదు అక్కడి ఆడపిల్లలకు సరికొత్త భవిష్యత్తుని ఇచ్చింది. నేటి కాలంలో విద్యావంతులు ఉన్న నగరాలు.. పట్టణాలు ఆడపిల్లలను నలుసులు గా చూస్తున్నాయి. కానీ ఈ గ్రామంలో ప్రజలు మాత్రం ఆడపిల్లను దేవతలాగా.. ఆమె పుడితే ఒక పండగలాగా జరుపుతున్నారు. ఈ గ్రామం నుంచి దేశమే పాఠం నేర్చుకోవాలి.
