Homeఆంధ్రప్రదేశ్‌YS Sharmila: జగన్ పై 'ప్రత్యేక హోదా' తో షర్మిల ఫైట్

YS Sharmila: జగన్ పై ‘ప్రత్యేక హోదా’ తో షర్మిల ఫైట్

YS Sharmila: ఎన్నికల ముందు ప్రత్యేక హోదా ప్రాధాన్యత అంశంగా మారనుంది. గత ఎన్నికల ముందు సైతం ఈ స్లోగన్ బాగానే వర్కౌట్ అయ్యింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని జగన్ విపక్షనేతగా ఊరూ వాడా ప్రచారం చేశారు. ప్రత్యేక హోదా తోనే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని.. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని చెప్పుకొచ్చారు. దీంతో యువత జగన్ వైపు మొగ్గు చూపారు. జగన్ కు అండగా నిలిచారు. అత్యధిక మెజారిటీతో గెలిపించారు. కానీ గత ఐదు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా అన్నమాటనే జగన్ మరిచిపోయారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రత్యేక హోదా నినాదం తెరపైకి రావడం విశేషం.

పీసీసీ పగ్గాలు తీసుకున్న షర్మిల ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేసుకున్నారు. వైసిపి ప్రభుత్వ వైఫల్యాలతో పాటు అవినీతి, దోపిడీలను ఎండగడుతున్నారు. ఇప్పుడు మరో ముందు అడుగు వేసి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రత్యేక హోదా అస్త్రంతో ఎన్నికల్లో జగన్ కు గట్టి దెబ్బ తీయాలని భావిస్తున్నారు. ఫిబ్రవరి రెండున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రత్యేక హోదాపై ధర్నా చేయనున్నారు. ఏపీ నుంచి కాంగ్రెస్ ముఖ్య నేతలు ఢిల్లీ రావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలోనూ ఈ హామీ కాంగ్రెస్ ఇచ్చినా.. అధికారంలోకి రాకపోయేసరికి సాధ్యపడలేదు.

అయితే ఇదే నినాదంతో ఏపీలో కాంగ్రెస్ బలపడాలని చూస్తోంది. అదే సమయంలో వైసీపీని దారుణంగా దెబ్బతీయాలని భావిస్తోంది. వైసీపీని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్ నాడు చెప్పుకొచ్చారు. 25 పార్లమెంటు స్థానాలను ఇవ్వండి.. మీ గొంతుకనై పని చేస్తానంటూ జగన్ ప్రగల్బాలు పలికారు. తీరా గెలిచిన తర్వాత బిజెపికి దాసోహం అయ్యారు. ప్రత్యేక హోదా గురించి అడిగిన పాపాన పోలేదు కానీ తన రాజకీయ అవసరాలు, కేసుల విషయంలో మాత్రం చాలా వరకు ప్రయోజనాలు పొందారు. తన వ్యక్తిగత హోదాను పెంచుకున్నారు. ప్రత్యేక హోదాను మాత్రం మరిచిపోయారు. ఇప్పుడు అదే లైన్ తీసుకొని షర్మిల పోరాటం చేయనున్నారు. ఢిల్లీలో దీక్ష చేయడం ద్వారా ప్రత్యేక హోదా అంశాన్ని హైలైట్ చేయనున్నారు. హోదా అంశంతో పోరాడితే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో హోదా విషయంలో జగన్ చేసిన హామీ, గత ఐదేళ్లుగా మరిచిపోయిన వైనాన్ని షర్మిల ప్రస్తావించునున్నారు. అది రాజకీయంగా వైసీపీకి మైనస్ గా మారింది. దీంతో వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. షర్మిల ద్వారా పెద్ద ముప్పు ఉందని భావిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular