Homeజాతీయ వార్తలుసచివాలయాన్ని ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగించండి

సచివాలయాన్ని ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగించండి

ఖాళీగా ఉన్న తెలంగాణ సచివాలయాన్ని ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సూచించారు.

తెలంగాణలో కరోనా (కొవిడ్‌-19) బాధితుల సంఖ్య అధికంగా పెరిగినట్లయితే, సచివాలయం ఖాళీగా ఉన్నందున ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు బండి సంజయ్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

కాగా, ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట పరిస్థితులలో, అన్ని సంస్థలు, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు సమిష్టిగా కృషి చేసి, భయంకర కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు, గత ఆదివారం భారతీయులందరూ సమిష్టిగా జనతా కర్ఫ్యూ పాటించి, ఎటువంటి విపత్తు నైన ఎదుర్కొనే సత్తా ఉందని నిరూపించారని గుర్తు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం తరపున, ముఖ్య మంత్రిగా కేసీఆర్, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన అభినందనలు తెలిపారు.

అలాగే తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కరోనా రూపంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతున్న సందర్భంలో, ఈ ప్రమాదకర వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకునే చర్యలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.

సోమవారం నుండి తెలంగాణలో లాక్ డౌన్ పరిస్థితుల దృష్ట్యా, కొంత మంది ఈ విపత్తును అవకాశంగా తీసుకొని స్వలాభం కోసం స్వార్ధంతో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను ఒక్కసారిగా పెంచేశారని సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా సామాన్య, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఈ విషయంలో కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద తీసుకొని, ధరల నియంత్రణ చేపట్టాలని కోరారు.

కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా, దేశం లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న, తెలంగాణ ప్రజల సౌలభ్యం కోసం, ఆయుష్మాన్ భారత్ పథకం లో తెలంగాణ రాష్ట్రం భాగస్వామ్యం అయ్యేట్లు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా సంజయ్ కోరారు.

తెలంగాణలో బిజెపికి క్రమశిక్షణ కలిగిన క్షేత్రస్థాయి కార్యకర్తలు లక్షల సంఖ్యలో ఉన్నారని చెబుతూ ప్రపంచవ్యాప్తంగా వేలసంఖ్యలో ప్రజల ప్రాణాలు హరిస్తున్న కరోనాపై పోరాటానికి చేపట్టే కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు తామంతా సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ కు తెలిపారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular