తెలంగాణలో బీజేపీకి పూర్తి సారథి ఎంపికకు కసరత్తు జరుగుతోంది. 2023 ఎన్నికలకు ముందు బీజేపీ బండి సంజయ్ పదవీకాలం పూర్తి కావడంతో ఆయనను తప్పించి తాత్కాలిక అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని నియమించింది. ఆయన సారథ్యంలోనే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది. అయితే ఆశించిన ఫలితాలు రాలేదు. 2020 నుంచి 2023 వరకు అధ్యక్షుడిగా ఉన్న సంజయ్ నేతృత్వంలో పార్టీ గణనీయంగా పుంజుకుంది. పట్టణాలకే పరిమితమైన బీజేపీని సంజయ్ తన పాదయాత్రల ద్వారా గ్రామస్థాయికి తీసుకెళ్లారు. ఉద్యమాలతో ఊపు తెచ్చారు. 2023 ఎన్నికల్లో సంజయ్ సారథ్యంలోనే బీజేపీ పోటీ చేస్తుందని అధిష్టానం మొదట ప్రకటించింది. అయితే కొంత మంది నేతల ఒత్తిడికి తలొగ్గిన అధిష్టానం పదవీ కాలం ముగిసిన మూడు నెలల తర్వాత సంజయ్ను తప్పించింది. ఆయన స్థానంలో కిషన్రెడ్డిని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించింది. ఆ తర్వాత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు రావడంతో అధ్యక్షుడి ఎన్నిక వాయిదా పడింది. ఇప్పుడు అన్ని ఎన్నికలు పూర్తి కావడంతో నూతన అధ్యక్షుడి నియామకంపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. కొత్త కమల దళపతి ఎవరు అన్న సస్పెన్స్ పార్టీలో కొనసాగుతోంది. 2029లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ ఉంది. ఆమేకు కొత్త అధ్యక్షుడి నియామకం కూడా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు నియమించే అధ్యక్షుడు 2029 ఎన్నికల వరకు ఉంటారని తాత్కాలిక అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీనీ అగ్రెసివ్గా జనాల్లోకి తీసుకెళ్లేనాయకుడి కోసం అధిష్టానం చూస్తోంది. తమ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేసే నేత కావాలని హైకమాండ్ కోరుకుంటోంది.
సంజయ్కే ఛాన్స్?
ఇక బీజేపీ కొత్త అధ్యక్షుడిగా మరోమారు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన అయితేనే పార్టీని అగ్రెసివ్గా ప్రజల్లోకి తీసుకెళ్తారని, పార్టీ భావజాలాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారని అంచనా వేస్తోంది. సంజయ్ అధ్యక్షుడు అయ్యాక పార్టీకి మంచి క్రేజ్ వచ్చింది. దీంతో తెలంగాణలో ఇప్పుడు బండి సంజయ్కి ముందు.. సంజయ్ తర్వాత అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ మరోసారి సంజయ్కే తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించాలన్న ఆలోచనలో ఉంది. కిషన్రెడ్డిని అధ్యక్షుడిగా నియమించిన తర్వాత తెలంగాణలో బీజేపీ మళ్లీ డీలా పడింది. ఈ నేపథ్యంలో గతంలో బీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్న స్థాయికి పార్టీని తీసుకెళ్లిన సంజయ్ని మరోసారి అధ్యక్షుడిగా నియమిస్తే.. కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా పార్టీకి ఊపు తెస్తాడన్న ఆలోచనలో ఉంది. తనదైన దూకుడుతో క్యాడర్లోనూ ఉత్సాహం వస్తుందని కమలం పెద్దలు భావిస్తున్నారు.
బీసీల్లో గుర్తింపు..
ఇక సంజయ్కు బీసీల్లో మంచి గుర్తింపు ఉంది. తెలంగాణలో బీసీల్లో ఎక్కువ జానాభా ఉండే మున్నూరు కాపు సామాజికివర్గానికి చెందిన నేత సంజయ్. ఇప్పుడు తెలంగాణలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. తాజా గణన ప్రకారం 46.65 శాతం బీసీలు ఉన్నారు. ఈ పరిస్థితిలో బీజేపీ పగ్గాలు బీసీకే ఇవ్వడం సరైనదని కమలనాథులు ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు కేంద్ర రాజకీయాలకే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో సంజయ్కే చాన్స్ ఎక్కువగా ఉందన్న చర్చ జరుగుతోంది.