Homeజాతీయ వార్తలుదళితబంధు.. ప్రభుత్వానికి అవుతుందా మందు?

దళితబంధు.. ప్రభుత్వానికి అవుతుందా మందు?

Rythu bandhu schemeహుజురాబాద్ ఉప ఎన్నికపై పార్టీలు తమ వైఖరులు మార్చుకుంటున్నాయి. ఎన్నికల్లో నెగ్గేందుకు తమ విధానాలు రూపొందించుకుంటున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ ఈటల రాజేందర్ ను ఢీకొట్టే క్రమంలో పథకాల వరద పారిస్తోంది. ఆచరణకు సాధ్యం కాని హామీలు గుప్పిస్తూ ఓటర్లను ప్రభావితం చేసే పనిలో పడింది. దళిత బంధు పేరుతో ఒక్కో కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ అది ఆచరణ సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. రెండేళ్లలో జరిగే శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుందనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి.

హుజురాబాద్ లో రెండు లక్షల ఇరవై ఆరు వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 45 వేల మంది ఎస్సీ ఓటర్లున్నారు. నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేయగల సంఖ్యలో ఎస్సీలు ఉండడంతో ప్రభుత్వం ఇక్కడి నుంచి దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టినట్టు భావిస్తున్నారు. బీసీ సామాజిక వర్గంలో పద్మశాలి ఓట్లు 26 వేలు ఉన్నాయి. అలాగే కాపు సామాజికవర్గం ఓట్లు కూడా దాదాపు 26 వేల వరకు ఉంటాయి. దీంతో టీఆర్ఎస్ ఇక్కడ విజయం సాధించాలంటే దళితుల ఓట్లే కీలకమని భావించి వారిపై ఎక్కడ లేని ప్రేమ ఒలకబొస్తుందని చెబుతున్నారు.

ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల జోలికి పోవడం లేదు. దళితులకు మూడెకరాల భూమి, దళితుడిని సీఎం తదితర హామీలిచ్చినా ఇంతవరకు వాటి జోలికి పోలేదు. ఎక్కడ కూడా ఒక్క సెంటు భూమి కూడా దళితులకు ఇవ్వలేదు. ఇప్పుడు దళితబంధు పేరుతో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ర్ట అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఇప్పటికే విమర్శలు చేశారు. దీంతో దళితుల్లో ఇప్పటికే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

టీఆర్ఎస్ పార్టీ దళితబందుపై ఆశలు భారీగానే పెట్టుకుంది. ఇన్ని వేల కోట్లు వెచ్చించి వారికి లబ్ధి చేకూర్చేందుకు సంకల్పించినా ఆచరణ మాత్రం కష్టమే. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తే ఎన్ని వేల కోట్లు కావాలి? ఎక్కడి నుంచి తెస్తుంది? అనే అనుమానాలు సైతం వస్తున్నాయి. దీంతో ప్రతిపక్షాలకు కూడా ఓ మంచి టాపిక్ దొరికట్లయింది. దీంతో టీఆర్ఎస్ ఇరుకున పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇచ్చిన హామీలన్ని గాలికొదిలేసి కొత్త పథకాలు ప్రారంభించి లబ్ధి పొందాలని చూస్తున్న ప్రభుత్వంపై ఇప్పటికే విమర్శలు జోరందుకున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో దళితబంధుతో విజయం సాధించి తీరాలని గట్టి పట్టుదలతో ఉన్న ప్రభుత్వం కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి మరి. ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థి విజయం కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టడానికి ముందుకు రావడంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular