Homeజాతీయ వార్తలురెమిడిసివిర్‌‌ రూ.75 వేలు.. తుసిలిజుమాబ్‌ రెండు లక్షలు..

రెమిడిసివిర్‌‌ రూ.75 వేలు.. తుసిలిజుమాబ్‌ రెండు లక్షలు..

శవాల మీద ప్యాలాలు వేరుకోవడం అంటే ఇదేనేమో. ఓ వైపు దేశవ్యాప్తంగా ప్రజలు కరోనాతో ప్రాణాలు కోల్పోతుంటే ప్రైవేటు ఆస్పత్రులు.. మందుల మాఫియా మాత్రం తమ బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. కరోనా క్రైసిస్‌ టైమ్‌లో ప్రజలకు అండగా నిలిచి.. ప్రజల ప్రాణాలు కాపాడాల్సింది పోయి దోపిడీకి పాల్పడుతున్నారు. ఏకంగా మందులు బ్లాక్‌ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది.

తెలంగాణ మార్కెట్లో యాంటీ వైరల్‌ మెడిసిన్‌ విషయంలో కొనసాగుతోందీ దందా. సాధారణంగా రెమిడిసివిర్‌‌ ఇంజక్షన్‌ ధరలు కంపెనీని బట్టి రూ.899 నుంచి రూ.3,490 వరకు ఉంది. కోవిడ్‌ వచ్చిన పేషెంట్‌కు ఈ ఇంజక్షన్‌ వాడుతుంటారు. అలాగే.. తుసిలిజుమాబ్‌ ఇంజక్షన్‌ ధర రూ.30 వేల వరకు ఉంది. అయితే.. కోవిడ్‌ కంట్రోల్‌లో ఎంతో ప్రధానమైన ఈ ఇంజక్షన్ల కొరత రాష్ట్రంలో సృష్టించారు. బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తూ మందుల మాఫియా దండుకుంటోంది. రోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఈ ముఠా దోచుకుంటోంది. ముఖ్యంగా పలు ప్రైవేటు ఆస్పత్రులు, మాఫియా ముఠాలతోపాటు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది చేతులు కలపడంతో ఈ దుస్థితి వచ్చినట్లుగా తెలుస్తోంది.

బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం రెమిడిసివిర్‌‌ను రూ.25 వేల నుంచి రూ.75 వేల వరకు విక్రయిస్తున్నారు. ఇక తుసిలిజుమాబ్‌ను రూ.70 వేల నుంచి రూ.2 లక్షల వరకు అమ్ముతున్నారు. ఇక ప్రాణాలు కాపాడుకునేందుఉక ప్రజలు ఏమీ చేయలేక ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తున్నారు. అయితే..ఈ రెండు మందులు కూడా సాధారణ మార్కెట్లో విక్రయించడానికి లేదు. కేవలం అత్యవసర సమయంలోనే వాడుతుంటారు. దీనికి కరోనాను తగ్గించే సామర్థ్యం లేదు. కేవలం రోగి ఆరోగ్య పరిస్థితి క్షీణించకుండా కాపడుతుంటుంది. రక్తంలో ఆక్సిజన్‌ శాచురేషన్‌ 90 శాతం వరకు ఉండి, వెంటిలేటర్‌ లేదా ఆక్సిజన్‌పై చికిత్స చేస్తున్నప్పుడు, ఇన్ఫెక్షన్లు తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే రెమిడిసివిర్‌ను వాడాలి. పైగా కరోనా పాజిటివ్‌గా గుర్తించిన మొదటి 9 రోజుల్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే రోగి కోలుకునే అవకాశం ఉంటుందని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

తుసిలిజుమాబ్‌ను కూడా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న రోగులకు జాగ్రత్తగా వాడాలి. ఇష్టమొచ్చినట్టు వాడితే రోగి పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు కూడా ఉన్నాయి. కానీ.. కొందరు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోని డాక్టర్లు డబ్బుల కోసం ఈ ఔషధాలను విరివిగా వాడేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిత్యం ప్రైవేటు ఆస్పత్రుల్లోని కరోనా కేసుల వారీగా రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ ఈ యాంటీ వైరల్‌ ఔషధాలను సరఫరా చేస్తుంటుంది. లేదా రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అందిస్తుంటుంది. ఈ రెండు ప్రభుత్వ సంస్థల ద్వారానే ఈ ఔషధాలు మార్కెట్లోకి సరఫరా కావాలి. కానీ.. కొందరు మాఫియా తమ చేజిక్కించుకొని బ్లాక్‌ మార్కెట్‌ సృష్టించి.. ఇష్టం వచ్చినట్లుగా ఆడుతున్నాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular