CM Jagan
CM Jagan: ఏపీలో వైసీపీకి మరో కొత్త సవాల్. పార్టీ ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన అనివార్య పరిస్థితి. ఎందుకంటే మార్చిలో రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. ఏప్రిల్ 2 నాటికి ఏపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు రిటైర్ అవుతున్నారు. వారి స్థానంలో కొత్త వారి నియామకానికి మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ మూడు స్థానాలు వైసీపీకి వస్తాయా? రావా? అన్నది అనుమానమే.
గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైసీపీకి ఝలక్ ఇచ్చింది. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించింది. నలుగురు టిడిపి ఎమ్మెల్యేలు వైసీపీలోకి ఫిరాయించినా.. సంఖ్యా బలం లేకున్నా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని టిడిపి దక్కించుకుంది. ఏకంగా వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల మద్దతును పొందింది. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో సైతం అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. రాజ్యసభలో ఏపీకి చెందిన సీఎం రమేష్, కనక మేడల రవీంద్ర కుమార్, వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి రిటైర్ అవుతున్నారు. వీరి స్థానంలో మరో ముగ్గురిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికలు మార్చిలో జరగనున్నట్లు తెలుస్తోంది.
ఏపీ అసెంబ్లీలో 175 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలందరినీ మూడుగా విభజిస్తారు. ఒక్కో రాజ్యసభ సీటు గెలవడానికి 59 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి. ఈ లెక్కన ఈ మూడు స్థానాలను వైసిపి గెలుచుకోనుంది. కానీ ఇక్కడే టిడిపి మరోసారి గేమ్ ప్లే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్క రాజ్యసభ స్థానానికి టిడిపి పోటీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీలో బలం 23. కానీ అందులో నలుగురు పార్టీ ఫిరాయించారు. అదే సమయంలో వైసీపీ నుంచి నలుగురు టిడిపిలో చేరారు. ప్రస్తుతం టిడిపికి 23 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. రాజ్యసభ సీటు గెలవాలంటే ఆ పార్టీకి మరో 36 మంది అవసరం.
వైసిపి పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతోంది. దాదాపు ఆ సంఖ్య 80 వరకు ఉంటుందని ఒక అంచనా. ఇప్పటికే రెండు జాబితాలను ప్రకటించారు. మూడో జాబితా వెల్లడి కానుంది. 30 నుంచి 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ మొండి చేయి చూపనున్నారు. వీరంతా జగన్ కు వ్యతిరేకంగా మారడం ఖాయం. సరిగ్గా ఇదే సమయంలో రాజ్యసభ ఎన్నికలు వస్తే మాత్రం.. బాధిత ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. అటు చంద్రబాబు సైతం ఆర్థికంగా బలమైన అభ్యర్థిని బరిలో దించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రలోభాలు కూడా తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉంది. అటు ఎమ్మెల్యేల పదవీకాలం నెలరోజుల వ్యవధిలో ముగియనుండడంతో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంది. అందుకే వైసీపీకి ఇది క్లిష్ట సమయం. ఎన్నికల ముంగిట రాజ్యసభ స్థానాన్ని పోగొట్టుకుంటే మాత్రం దాని ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుంది. మరి జగన్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Rajya sabha elections are difficult for jagan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com