Homeఎన్నికలుసొంత నియోజకవర్గాన్ని కాదని రాజాసింగ్‌ వేరే చోట పర్యటనలేంటి..?

సొంత నియోజకవర్గాన్ని కాదని రాజాసింగ్‌ వేరే చోట పర్యటనలేంటి..?

రాష్ట్రంలో మొన్నటివరకు బీజేపీకి ఉన్నది ఒక్కరే ఎమ్మెల్యే. ఆయనే రాజాసింగ్‌. గోషామహల్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారాయన. ప్రస్తుతం గ్రేటర్‌‌లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ తన సొంత నియోజకవర్గమైన గోషామహల్‌లో ప్రచారం చేపట్టకుండా ఏదేదో ఏరియాల్లో పర్యటిస్తున్నారు ఆయన. దీంతో అక్కడి అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇతర పార్టీల తరపున రాజాసింగ్‌ కులస్తులు, మరోవైపు పార్టీలో తన అనుచరులు పోటీలో ఉండడంతో ఎవరికి ప్రచారం చేసినా మరొకరికి దూరం అవుతాడనే ఉద్దేశంతో ఎమ్మెల్యే నియోజకవర్గానికి అంటిముట్టనట్లుగా ఉంటున్నాడని ఆ పార్టీలో చర్చ నడుస్తోంది.

Also Read: సంజయ్‌.. అక్బరుద్దీన్‌లపై కేసు నమోదు

గ్రేటర్‌ ఎన్నికల నగారా మోగిననాటి నుంచి ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడిగా ఉంటున్న విశ్వకర్మ కులానికి చెందిన ఎం.కృష్ణ తన సతీమణి శశికళకు మంగళ్‌హాట్‌ టికెట్‌, జైశ్వాల్‌ సమాజ్‌కు చెందిన మరో అనుచరుడు రాకేష్‌ జైశ్వాల్‌కు జాంబాగ్‌, అసెంబ్లీ ఎన్నికల్లో బేగంబజార్‌ నుంచి అత్యధిక ఓట్లు బీజేపీకి రావడంలో కీలక పాత్ర పోషించిన శంకర్‌ యాదవ్‌కు బేగంబజార్‌ టికెట్‌, గన్‌ఫౌండ్రీ టికెట్‌ను ఎస్సీ వర్గానికి చెందిన డాక్టర్‌ సురేఖ ఓం ప్రకాష్‌ భీష్వకు కేటాయించారు. దత్తాత్రేయ నగర్‌, గోషామహల్‌ డివిజన్లలో మాత్రం బీజేపీ టికెట్లను లోథి కమ్యూనిటీకి చెందిన వారికి కేటాయించారు. అయితే.. ఆ నాలుగు డివిజన్ల అభ్యర్థులకు పార్టీ తరఫున ప్రచారం చేస్తే తన లోథ్‌ కులస్తుల నుంచి ఇబ్బందులు వస్తాయని, ఈ సారి ఎన్నికలు మీరే చూసుకోవాలని అభ్యర్థులకు రాజాసింగ్‌ సూచించినట్లు సమాచారం.

మరోవైపు.. మంగళ్‌హాట్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ నుంచి పరమేశ్వరీ సింగ్‌, టీడీపీ నుంచి ఊర్మిళాదేవి, కాంగ్రెస్‌ నుంచి జ్యోతి బరిలో ఉన్నారు. వీరు లోథ్‌ కమ్యూనిటీకి చెందిన వారు కావడం, బీజేపీ అభ్యర్థి ఇతర కమ్యూనిటీకి చెందిన వారు కావడంతోనే ఎమ్మెల్యే రాజాసింగ్‌ తన ముఖ్య అనుచరుడి తరపున కూడా ప్రచారం చేయడం లేదని చర్చ జరుగుతోంది. దత్తాత్రేయ నగర్‌, గోషామహల్‌ డివిజన్‌లలో బీజేపీ నుంచి ఎమ్మెల్యే కులస్తులకే టికెట్‌ కేటాయించారు. టీఆర్‌ఎస్‌ నుంచి ముఖేష్‌ సింగ్‌కు టికెట్‌ వచ్చింది. ముఖేష్‌ సింగ్‌ లోథ్‌ క్షత్రియ సమాజ్‌(కులసంఘం)లో కీలక పదవిలో ఉన్న సమయంలో రాజాసింగ్‌ మంగళ్‌హాట్‌ కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచారు. ఆ సమయంలో రాజాసింగ్‌కు ముఖేష్‌ సహకారం అందించారనే ప్రచారం ఉంది. అప్పటి నుంచి వీరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.

Also Read: గ్రేటర్‌‌ రిజల్ట్‌ మీదే యువరాజు భవితవ్యం

అందుకే.. గోషామహల్‌ బీజేపీ అభ్యర్థి లాల్‌ సింగ్‌ తరఫున ప్రచారం చేసి ముఖేష్‌ సింగ్‌పై వ్యతిరేకతను ఎత్తిచూపలేరని, అందుకే అటు మంగళ్‌హాట్‌, ఇటు గోషామహల్‌ డివిజన్లలో రాజాసింగ్‌ ప్రచారం చేయడం లేదని సమాచారం. జాంబాగ్‌, గన్‌ఫౌండ్రీ, బేగంబజార్‌ టికెట్ల విషయంలో రాజాసింగ్‌ను కాదని ఇతరులకు కేటాయించారనే ప్రచారం ఉండడంతో అక్కడి నాయకులకు సైతం ఎమ్మెల్యే సహకారం దక్కేలా లేదు. మొత్తానికి బీజేపీలో కీలక నేతగా ఉంటూ, ఎంఐఎంకు దీటైన సమాధానం చెప్పే రాజాసింగ్‌ను నమ్ముకొని టికెట్లు తెచ్చుకున్న అనుచరులు ఆయనను ప్రచారానికి రమ్మనలేక, ఇటు సొంత ఇమేజ్‌తో ఓట్లడగలేక గందగోళంలో ఉన్నారని ప్రచారం సాగుతోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular