పార్టీ మారతారంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ఇటీవల తన నియోజకవర్గానికి సంబంధించి పార్టీలో చేరిన నేతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ముఖ్యమంత్రి పక్క చూపులు చూసి ప్రముఖ బీజేపీ నేత గంగరాజు కుమారుడు రంగరాజును తెచ్చుకున్నారని.. తాను పక్క చూపులు చూడటం లేదన్నారు. సీఎం ముందు చూపుతో ఆయన్ను తీసుకొచ్చారేమో తనకు తెలియదని.. తనకు కనీసం మాట మాత్రం చెప్పకుండా నర్సాపురం పార్లమెంట్ వైఎస్సార్సీపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారన్నారు.
ముఖ్యమంత్రి జగన్ అపాయింట్ మెంట్ తమకు దొరకడం లేదని ఆయన వాపోయారు. సీఎం అపాయిట్ మెంట్ ఎందుకు ఇవ్వడం లేదో తెలియదని.. పార్లమెంట్ సమావేశాల సమయంలో రెండుసార్లు పిలిచారు కలిశాను అన్నారు. ఢిల్లీ వచ్చినప్పుడు కలుద్దామనుకున్నానని.. కరోనా వల్ల సీఎం ఢిల్లీ రావడం లేదన్నారు. ఇక్కడ కలిసే అవకాశం తమకు లేదని.. దీన్ని ఓపెన్ గా సిగ్గు విడిచి చెప్పుకుంటున్నాను అన్నారు. సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పుకోవడానికి ఏమైనా గర్వకారణమా.. బాధతోనే చెప్పుకుంటున్నాను అన్నారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.