ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి టైమ్ మొదలైందని చెప్పొచ్చు. ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ లో.. కొత్త జోష్ కనిపిస్తోంది. దీన్నిబట్టి కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ ను ఎంత బలంగా కోరుకున్నారో అర్థమవుతోంది. కేసీఆర్ ను ఎదుర్కొనే నేత రేవంత్ మినహా.. మరెవరూ లేరనే నిర్ణయానికి కాంగ్రెస్ కేడర్ వచ్చేసింది. పీసీసీ ప్రకటన వచ్చిన దగ్గర్నుంచే ఈ పరిస్థితిని గమనించొచ్చు. ప్రమాణ స్వీకారం నాటికి తారస్థాయికి చేరింది. అయితే.. కేవలం పార్టీలో జోష్ ఉంటే చాలదు.. అది ఉన్నట్టుగా జనానికి తెలియాలి. అలా తెలియాలంటే.. మీడియా సపోర్టు కావాలి. ఇప్పుడు రేవంత్ వెనకాల అదే బలంగా ఉందని స్పష్టమవుతోంది.
గతంలో పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి మీడియాలో ఏ మాత్రం కవరేజ్ రాలేదనే చెప్పాలి. ఏదో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఓ బైట్ వేయడం తప్ప.. మీడియా నుంచి సపోర్టు దక్కలేదు. నిజానికి ఆయన ఉన్నంత కాలం పార్టీకోసం చేయాల్సిందంతా చేశారు. కానీ.. కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాలు ఒకవైపు.. మీడియా దన్ను లేకపోవడం మరోవైపు తోడై.. ఉత్తమ్ ను నామమాత్రంగా మార్చేశాయి. కానీ.. ఇప్పుడు రేవంత్ కు ఎక్కడలేని కవరేజ్ వస్తోంది.
ఇదంతా.. ఒక మీడియా అధిపతి రేవంత్ వెనక ఉండి నడిపిస్తున్నట్టుగా చెబుతున్నారు. కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా సాగుతున్న పోరాటంలో.. సదరు మీడియా అధినేత బలంగా రేవంత్ వెంట ఉన్నారని అంటున్నారు. అంతేకాదు.. రేవంత్ కు రాష్ట్రానికి సంబంధించిన ఫీడ్ బ్యాక్ ఇస్తూ.. ఆయన ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అనే విషయాల వరకు అందిస్తూ.. ఒక సలహాదారులాగా మారిపోయారని అంటున్నారు.
వచ్చే 2023 ఎన్నికల నాటికి రేవంత్ కేసీఆర్ కు ధీటుగా నిలబడాలన్నదే ఆ మీడియా సంస్థ లక్ష్యంగా చెబుతున్నారు. అందుకే.. రేవంత్ ఏం మాట్లాడినా.. పతాక శీర్షికల్లో కవరేజ్ ఇస్తున్నట్టు సమాచారం. ఇది కాంగ్రెస్ కు మంచి పరిణామమే. ఇప్పటి వరకూ తెలంగాణ కాంగ్రెస్ కు దక్కని మీడియా ప్రచారం.. రేవంత్ రూపంలో అందుతోంది. ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా ఉండే ఆ మీడియా సంస్థ.. ఇక్కడ రేవంత్ కు అండగా నిలుస్తోందని చెబుతున్నారు.