
దేశాన్ని పోలియో రహిత ఇండియాగా మార్చడమే లక్ష్యంగా మన ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు మరో విడత పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖ పలు సూచనలు చేసింది. దగ్గు, జలుబు, జ్వరం ఉంటే చిన్నారులకు పోలియో చుక్కలు వేయవద్దని చెప్పింది. ఈ లక్షణాలు తగ్గిన తర్వాత చిన్నారులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లి చుక్కల మందు వేయించాలని తల్లిదండ్రులకు సూచించింది.
దేశ వ్యాప్తంగా ఆదివారం ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు మందు వేసే శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మందు వేస్తారు. అలాగే నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. వాస్తవానికి జనవరి 17 నుంచి పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. కరోనా టీకా పంపిణీ కార్యక్రమం జనవరి 16 నుంచి ప్రారంభం కావడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా పడింది.
ఇక.. తెలుగు రాష్ట్రాల్లో పల్స్ పోలియో కార్యక్రమానికి ఆరోగ్యశాఖలు సిద్ధమయ్యాయి. నేటి నుంచి మూడు రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఏపీలో 52,72,354 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. తెలంగాణలోనూ ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా ఐదేళ్లలోపు ఉన్న 38,31,907మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇక హైదరాబాద్ జిల్లా పరిధిలో 5,15,520 మంది చిన్నారులకు చుక్కలు వేయనున్నారు.