Congress : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఏ పార్టీలో ఉంటే గెలుస్తా.. ఏ పార్టీ నుంచి టికెట్ వస్తుందని లెక్కలు వేసుకుని మంతనాలు జరుపుతున్నారు. టికెట్ రిజర్వ్ చేసుకుంటున్నారు. ఇందుకు అధికార బీఆర్ఎస్ నేతలు కూడా అతీతులు కాదు. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని భావిస్తున్న బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్, బీజేపీతో మంతనాలు జరుపుతున్నారు. ఇక కర్ణాటక ఎన్నికల తర్వాత మంచి ఊపు వచ్చిన కాంగ్రెస్వైపు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారు. ఇక మొన్నటి వరకు తెలంగాణలో దూకుడు మీద ఉన్న బీజేపీ వైపు చూసేవారు తగ్గిపోయారు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ నేత పట్నం మహేందర్ ఈసారి తనకు టికెట్ రాదని కాంగ్రెస్కు టచ్లోకి వెళ్లాడు. ఇంతలోనే గులాబీ బాస్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఇప్పుడు ఆయన సేఫ్గానే ఉన్నారు.. పట్నం వెంట వెళ్లిన నేతలే రెంటికి చెడ్డ రేవడిలా మారారు.
కాంగ్రెస్ దూకుడుతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి..
తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ బీఆర్ఎస్ నేతలకు కంటిమీద కునుకు లేకుంఆ చేస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్లో ఉంటూనే పలువురు నేతలు కాంగ్రెస్తో టచ్లోకి వస్తున్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి ఇదే ప్రయత్నం చేశారు. తనతో పాటుగా తన మద్దతుదారులకు సీట్ల గురించి మంతనాలు చేశారు. టికెట్ హామీ కూడా పొందారు. ఇంతలో ప్రగతి భవన్ నుంచి పిలుపు రావడం.. వెంటనే గులాబీ బాస్ ముందు వాలిపోవడం చకచకా జరిగిపోయాయి. స్వలాభం కోసం బీఆర్ఎస్ వైపు ఉండాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం అనుచర వర్గానికి ఇది రుచించటం లేదు. అనుచరుల తాజా వ్యూహాలో మహేందర్రెడ్డి గేమ్ బూమ్ రాంగ్ అయింది. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయింది అన్నట్లుగా పట్నం పరిస్థితి మారింది.
పైలెట్ చేతిలో ఓటమి..
బీఆర్ఎస్ తొలి విడత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పట్నం మహేందర్రెడ్డి… 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున తాండూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన సీనియార్టీని దృష్టిలో పెట్టుకొని.. పార్టీ హైకమాండ్.. ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తాండూర్ నియోజకవర్గంలో పోటీ చేసి, గెలిచిన పైలెట్ రోహిత్ రెడ్డి.. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత ఆయన పార్టీలో క్రియాశీలంగా మారారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మళ్లీ ఆయనకే టికెట్ ఇస్తుందనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే.. పట్నం మహేందర్రెడ్డికి ఛాన్స్ లేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్లో చేరేందుకు పట్నం రూట్ క్లియర్ చేసుకున్నారు.
బీఆర్ఎస్ లీకులు..
తనతోపాటుగా తన మద్దతు వర్గానికి సీట్ల పైన కాంగ్రెస్ లో చర్చించారు. స్పష్టమైన హామీ తీసుకున్నారు. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో రంగారెడ్డి జిల్లాలోని ఓ ఎమ్మెల్సీ ప్రగతి భవన్కు ఈ సమాచారం చేరవేశారు. దీంతో అక్కడి నుంచి ఫోన్ రావటంతో పరుగున వెళ్లిన మహేందర్రెడ్డికి ఆయన పాత చిట్టా బయట పెట్టారు. పార్టీ వీడితే జరిగేది ఏంటో సున్నిత హెచ్చరికలతో స్పష్టత ఇచ్చారు. అంతే.. మహేందర్రెడ్డి జీ హుజూర్ అంటూ గులాబీ తోటలోనే పని చేస్తానని ప్రకటించారు. అదే సమయంలో కొందరి సీట్ల ఖరారు అంటూ ఒక జాబితా బయట పెట్టారు. అందులో మాజీ మంత్రి చంద్రశేఖర్కు వికారాబాద్, తీగల అనితకు మహేశ్వరం, తాండూరు నుంచి మహేందర్ రెడ్డికి ఇవ్వాలని.. మహేందర్రెడ్డి సతీమణి సునీతకు చేవెళ్ల లోక్ సభ ఇస్తారంటూ వ్యూహాత్మక లీకులు వచ్చాయి.
‘పట్నం’కు దూరంగా క్యాడర్..
మహేందర్రెడ్డికి బీఆర్ఎస్లో తగిన గుర్తింపు లేదు. దీంతో అతని సన్నిహిత నేతలతో కాంగ్రెస్లోకి వెళ్లడానికే మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమనే నిర్ణయానికి వచ్చారు. పట్నం డబుల్ గేమ్తో ఇప్పుడు ఎవరికి వారు కాంగెస్ నేతలతో మంతనాలు ప్రారంభించారు. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. మహేందర్రెడ్డిని దూరం పెడుతున్నారు. ఈ పరిణామాలు ఊహించని మహేందర్రెడ్డి వ్యూహం బెడిసి కొట్టింది.