Homeజాతీయ వార్తలుఆదిత్యనాథ్ కు ఎదురుగాలి

ఆదిత్యనాథ్ కు ఎదురుగాలి

Yogi Adityanathఉత్తర ప్రదేశ్ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం నల్లేరుపై నడక కాదని స్పష్టం అవుతోంది. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కు ఎదురుగాలి వీస్తోందని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆయనపై పెరిగిన వ్యతిరేకత అని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో 300కు పైగా సాధించుకున్న బీజేపీ ఈసారి మాత్రం అందులో సగం కూడా దక్కించుకుంటే గొప్ప అని చెబుతున్నారు. దీంతో బీజేపీకి విజయం అసాధ్యం అని భావిస్తున్నారు. ప్రధాని మోదీ చరిష్మా సైతం తగ్గిందనే సంకేతాలు అందుతున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, నిర్ణయాలే ప్రధాన కారణమై బీజేపీ పతనానికి బాటలు వేస్తున్నాయని పలువురు చెబుతున్నారు.

నాలుగింటితోనే సరి
గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 11 స్థానాలకు గాను బీజేపీ కేవలం నాలుగింటిలో మాత్రమే విజయం సాధించింది. ఇందులో ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలు ఉన్నాయి. దీంతో రాష్ర్టంలో బీజేపీ తన పట్టు కోల్పోతుందని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ తన ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీని ఎలా దెబ్బతీయాలని ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఇంటికే పరిమితం చేయాలనే ప్రతిపక్షాల పాచికలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

తగ్గిన మోదీ చరిష్మా
ప్రధాని మోదీ చరిష్మా తగ్గిందని పలు సర్వేలు చెబుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో మోదీ విజయం అంత సులభమేమి కాదని విశ్లేషకులు చెబుతున్నారు. మోదీ చేపడుతున్న పథకాల అమలులో నియంతగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో కూడా అపజయం ఎదురు కావడంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి విజయం దక్కకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

పనికిరాని పథకాలతో..
బీజేపీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాల్సిన పథకాల జోలికి వెళ్లకుండా వారికి నష్టం కలిగించే వాటిపైనే దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపుతున్నారు. దీన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పెట్రోల్ పై రోజురోజుకు పెంచుతూ సుమారు రూ.100 వరకు తెచ్చారు. గ్యాస్ పై కూడా ఇదే స్థాయిలో పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. దీంతో బతుకుపై భరోసా కరువై రామచంద్రా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. బీజేపీ ప్రజల కోసం పథకాలు చేపట్టనంత వరకు విజయం అంత సాధ్యం కాదని చెబుతున్నారు. ఏది ఏమైనా రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి స్పష్టమనే సంకేతాలు వెలువడుతున్నాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular