దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజూకు పెరుగుతున్నది. వైరస్ విజృంభిస్తున్న తీరు.. తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. గత 24 గంటల్లో దేశంలో నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య పది వేలు దాటింది. ఒక్క రోజే 10956 కేసులు రికార్డు అయ్యాయి. ఒకే రోజులో పదివేల మార్క్ను దాటడం దేశంలో ఇదే మొదటిసారి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా వైరస్ వల్ల 396 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 297535కు చేరుకున్నది. 141842 మందికి వైరస్ యాక్టివ్గా ఉన్నది. 147195 మందికి వైరస్ నుంచి కోలుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది. వైరస్ వల్ల దేశంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 8498కి చేరుకున్నది.
మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయి. ఆ రాష్ట్రంలో ఒక్క రోజే 3607 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 152 మంది మరణించారు. ఓవరాల్గా మహారాష్ట్రలో 97648 కోవిడ్19 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆ రాష్ట్రం పాజిటివ్ కేసుల విషయంలో కెనడాను దాటేసింది. మహారాష్ట్రలో 46078 మంది కోలుకున్నారు. ఒక్క ముంబైలోనే 54085 కేసులు ఉన్నాయి. ఆ సిటీలో ఇప్పటి వరకు 1954 మంది మరణించారు.