
‘కరోనాతో సహజీవనం తప్పదు.. అది మనల్ని వదిలి ఇప్పుడే పోదు.. మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే’ అంటూ ప్రెస్మీట్లలో చెప్పిన మన తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ అంతే ఈజీగా కరోనా మీద చేతులెత్తేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను సీరియస్గా తీసుకోవడం మానేయడంతో కేసులు కూడా అంచనాకు అంతకుండా పెరిగిపోతూనే ఉన్నాయి. అందుకే.. ప్రారంభంలో ఎంతో ఆరాటంగా అమలు చేసిన లాక్డౌన్లు ఒక్కొక్కటిగా అన్లాక్ అవుతున్నాయి. ఈనెలతో అన్లాక్ 4 అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి పలు మార్గదర్శకాలు మూడు రోజుల క్రితం కేంద్రం విడుదల చేసింది. దీనికి తగ్గట్లే తెలంగాణ రాష్ట్ర సర్కార్ కూడా పలు నిర్ణయాలు వెల్లడించింది.
కరోనా నేపథ్యంలో ఆగిపోయిన మెట్రో రైళ్లను ఈనెల 7 నుంచి పునః ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే.. గతంలో మాదిరి కాకుండా దశల వారీగా రైళ్లను నడపాలని అనుకుంది. అంతేకాదు కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోనూ పలు అంశాలకు సంబంధించి అన్లాక్ 4 షురూ కానుంది. ఈ నెల 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లు నడుస్తాయని చెప్పిన ప్రభుత్వం.. ఆన్లైన్ క్లాసులను కూడా నిర్వహించుకోవచ్చని పేర్కొంది. స్కూళ్లు.. కాలేజీలు.. విద్యా శిక్షణ సంస్థలు.. సినిమాహాళ్లు.. స్విమ్మింగ్ పూల్స్.. ఎంటర్ టైన్మెంట్ పార్కులు.. థియేటర్లపై మాత్రం నిషేధం కంటిన్యూ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ రూల్స్ ఫాలో కావాలని ఆదేశించింది.
కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర సర్కారు అన్లాక్ గైడ్లైన్స్ తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ రిలీజ్ చేశారు. బార్లు, క్లబ్లు మూసి ఉంటాయని.. వాటిని తెరవాలంటే ప్రత్యేక ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. 65 ఏళ్లు దాటిన వారు.. అనారోగ్యంగా ఉన్న వారు, గర్భిణులు, పదేళ్ల కంటే తక్కువ వయసున్న వారు ఇళ్లకే పరిమితం కావాలని స్పష్టం చేశారు. కంటైన్మెంట్ జోన్ల నుంచి ఆన్ లైన్ విద్య కోసం యాభై శాతం మంచి అధ్యాపక.. అధ్యాపకేతర సిబ్బంది హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చారు. 9 నుంచి ప్లస్ టూ స్టూడెంట్స్, టీచర్స్, లెక్చరర్లు స్వచ్ఛందంగా స్కూళ్లు, కాలేజీలు సందర్శించే వీలుంది. ఇందుకు తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వకంగా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.
వీటితోపాటు సామాజిక, విద్య, క్రీడలు, వినోదం, ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు కల్చరల్ ప్రోగ్రాంలు వంద మంది నిర్వహించుకోవచ్చని గైడ్లైన్స్లో సూచించారు. పెళ్లిళ్లకు కూడా వంద మందికే పర్మిషన్ ఇచ్చారు. అదనంగా అంత్యక్రియలు, చివరి కర్మల్లో మాత్రం వంద మంది పాల్గొనేందుకు అనుమతి ఇచ్చారు. వీటికి అనుగుణంగా అన్లాక్ 4 అమలుకానుంది.