Homeఆంధ్రప్రదేశ్‌మాన్సాస్ రాజు అశోకుడే..

మాన్సాస్ రాజు అశోకుడే..

విజయనగరం జిల్లాలో మాన్సాస్ ట్రస్ట్ దేశంలోనే విద్యారంగంలో ప్రైవేటుగా నడిచే పెద్ద ధార్మిక సంస్థల్లో ఒకటి. వారసత్వ పోరు, అంత:కలహాలకు తోడు రాష్ర్ట ప్రభుత్వంతో వచ్చి పడిన వివాదం ట్రస్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. సంస్థపై ముసురుకున్న విమర్శలు అపరిమితమైన ఆస్తుల దుర్వినియోగం, రాజకీయ కారణాలు వెరసి మాన్సాస్ తేనె తుట్టెను కదిలిస్తున్నాయి. 18వ శతాబ్దంలో ఒడిశా నుంచి గోదావరి జిల్లాల వరకు తన ప్రాబల్యాన్నిమాన్సాస్ విస్తరించుకుంది. ట్రస్టు పరిధిలో 14 వేల ఎకరాల భూముల విలువ రూ. 60 వేల కోట్లకు చేరుకుంది. అయితే వాటిని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సంస్థకు అశోక్ గజపతి రాజు చైర్మన్ గా ఉన్నారు. ఆయనను మార్చాల్సిందేనని వైసీపీ పట్టుబట్టింది. మరో వారసురాలు సంచయితను చైర్మన్ గా చేసినా కోర్టు జోక్యంతో వెనకడుగు వేశారు. దీంతో న్యాయ పోరాటం చేస్తామని చెబుతున్నారు.

తన సోదరుడైన ఆనందగజపతి మరణానంతరం అశోక్ గజపతి రాజు 2016లో మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన టీడీపీలో కొనసాగుతుండడంతో వైసీపీ ఆయనను మార్చాలని పథకం వేసింది. మరో వైపు ఆయనపై వ్యక్తిగతంగా ఆరోపణలు లేకపోయినా సమర్థతపై స్థానికులే సందేహాలు వ్యక్తం చేశారు. దీంతో ఆయనను మార్చాలని వైసీపీ సంచయితను తెరమీదకు తీసుకొచ్చింది. 2019లో అదను చూసి వేటు వేసింది. కానీ కోర్టు జోక్యంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.

ఆనందగజపతి మొదటి భార్య ఉమాదేవి కుమార్తె సంచయిత. 2020 వరకు ఆమె గురించి ఎవరికి తెలియదు. 1991లోనే ఉమతో ఆనందగజపతి విడాకులు తీసుకున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చన తరువాత ఆమె మాన్సాస్ చైర్మన్ పై కన్నేశారు. అందుకే వైసీపీ ప్రభుత్వం అశోక్ ను గద్దె దింపి ఆమెకు పట్టం కట్టింది. హైకోర్టు తీర్పుతో ఆమె పదవీచ్యుతురాలైంది. ఈ ఉదంతంలో ఆమె తరఫున న్యాయపోరాటం చేయాలని వైసీపీ భావిస్తోంది.

ప్రభుత్వం ఏ ఉద్దేశంతో రంగంలోకి దిగినా ట్రస్టును కాపాడడం తక్షణ కర్తవ్యం. వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతం కాకుండా చూడటం ముఖ్య ఉద్దేశం. పదేళ్లుగా ఆడిట్ లేకుండా జవాబుదారీ తనం కోల్పోవడం ప్రధాన లోపాలుగా కనిపిస్తున్నాయి. ట్రస్టు ఆస్తుల విషయంలో అశోక్ గజపతి రాజుకు పెద్దగా అవగాహన లేదు. అలాగని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ప్రయోజనం శూన్యమే. మాన్సాస్ వ్యవహారాలపై విచారణ జరిపించి నిజాలు బయటపెట్టాలి. సమాజంలో పేరున్న విద్యావేత్తల ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి తద్వారా పరిపాలన కొనసాగించడం మంచిదనే అభిప్రాయం మేధావుల్లో వ్యక్తం అవుతోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular